టీమిండియా కోచ్ పదవిపై కొత్త బాంబ్: అసలు విషయం బయటపెట్టిన వీవీఎస్ లక్ష్మణ్
టీమిండియా హెడ్ కోచ్ పదవికి సంబంధించి మాజీ దిగ్గజ బ్యాటర్, ప్రస్తుత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 2024లో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టాల్సిందిగా బీసీసీఐ తనను సంప్రదించిందని వీవీఎస్ లక్ష్మణ్ ధ్రువీకరించారు. అయితే ఆ ఆఫర్ను తాను తిరస్కరించానని.. దానికి గల బలమైన కారణాలను కూడా ఆయన వివరించారు.
హెడ్ కోచ్ పదవిని వద్దనుకోవడానికి కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం మొదటి కారణమని ఆయన వెల్లడించారు. పూర్తి స్థాయి కోచ్గా మారితే ఎక్కువ కాలం పాటు ప్రయాణాలు చేస్తూ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. అంతటి కష్టమైన నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేకనే ఆ బాధ్యతను స్వీకరించలేదని చెప్పారు. దీనికితోడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పం కూడా తన నిర్ణయానికి రెండో కారణమని పేర్కొన్నారు. అక్కడ అప్పటికే తాను ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని భావించినట్లు వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.

బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహణలో తనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని.. మాజీ బీసీసీఐ కార్యదర్శి జై షాతో పాటు ప్రస్తుత కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా తన ఆలోచనలకు పూర్తి సపోర్ట్ ఇచ్చారని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు. అందుకే అక్కడ తన పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించుకోవడానికి సిద్ధపడ్డానని ఆయన వెల్లడించారు. ఈ రెండేళ్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ప్రతి విభాగానికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సిద్ధం చేశానని.. భవిష్యత్తులో తాను తప్పుకున్నా అక్కడ అత్యున్నత వ్యవస్థ కొనసాగేలా ప్లాన్ రూపొందించినట్లు వీవీఎస్ లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు.
విరాట్ కోహ్లీని ప్రశంసించిన వీవీఎస్ లక్ష్మణ్
బెంగళూరులో మీడియాతో జరిగిన సంభాషణలో లక్ష్మణ్ విరాట్ కోహ్లీని కూడా ప్రశంసించారు. కోహ్లీ వృత్తి నైపుణ్యాన్ని, అతను క్రికెట్ ఆడినప్పుడల్లా పాటించే అత్యున్నత ప్రమాణాలను వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు . చాలా మంది యువకులు కోహ్లీని ఆదర్శంగా తీసుకుని, ఆయన నుంచి నేర్చుకోవాలని చూస్తారని ఆయన అన్నారు. "విరాట్ ఓ ఆదర్శప్రాయమైన ప్రొఫెషనల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను ఏ జట్టు తరఫున ఆడినా, తనకు తానుగా నిర్దేశించుకున్న ప్రమాణాలను అందుకోవడానికి ప్రతిసారీ ప్రయత్నిస్తాడు. అందుకే అతను ఒక గొప్ప రోల్ మోడల్. చాలా మంది యువకులు లేదా ఆటగాళ్లు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటారు." అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.
గాయాల విషయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను సమర్థించిన వీవీఎస్ లక్ష్మణ్
ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాత్రపై వస్తున్న విమర్శలను వీవీఎస్ లక్ష్మణ్ తిరస్కరించారు. ప్లేయర్ల గాయాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, భారత జట్టు యాజమాన్యం మధ్య నిరంతర సమన్వయం ఉంటుందని ఆయన వివరించారు. ఆటగాళ్ల ఫిట్నెస్, పునరావాసం, పనిభారం నిర్వహణ విషయాల్లో ఇరు వర్గాలు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాయని వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

