హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా నాగ్పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీతో కోహ్లీ తన పేరిట అనేక మైలురాళ్లను నెలకొల్పాడు.
ఎన్నో రికార్డులు బద్దలు: లారా రికార్డుని సమం చేసిన కోహ్లీ
ఈ సందర్భంగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో వీవీఎస్ లక్ష్మణ్ తాను ఎందుకు కోహ్లీకి వీరాభిమానినో వివరించాడు. 'కెప్టెన్గా కోహ్లీ వ్యక్తిగత రికార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోడు. జట్టు గెలుపు కోసం ఏ విధంగా బ్యాటింగ్ చేయాలన్న దాని గురించే ఆలోచిస్తాడు. ఆ దిశగానే బ్యాటింగ్ చేస్తాడు' అని లక్ష్మణ్ అన్నాడు.
అందుకో కోహ్లీ బ్యాటింగ్ యావరేజి అన్ని ఫార్మాట్లలో 50కిపైగా ఉందని లక్ష్మణ్ చెప్పాడు. కోహ్లీ కెప్టెన్ బాధ్యతలు అందుకున్న తర్వాతే అతని బ్యాటింగ్ సగటు పెరిగిందని, కెప్టెన్సీ బాధ్యతను అతను ఎంతగానో ఎంజాయ్ చేస్తాడని తెలిపాడు. కోహ్లీలో ఉన్న ప్రత్యేకత అదేనని, అందుకే నేను కోహ్లీకి వీరాభిమానిని' అని లక్ష్మణ్ వివరించాడు.
ఇదిలా ఉంటే రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ చేయడంతో కెప్టెన్గా అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్గా గుర్తింపు పొందాడు. ఆదివారం నాటి సెంచరీ కోహ్లీకి కెప్టెన్గా 12వ సెంచరీ కావడం విశేషం. దీంతో అంతకు ముందు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 11 సెంచరీల రికార్డుని కోహ్లీ అధిగమించాడు.
ఈ క్రమంలో కెప్టెన్గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా (5 డబుల్ సెంచరీలు) రికార్డును సమం చేశాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కోహ్లీ చేసిన ఐదు డబుల్ సెంచరీలు కెప్టెన్గా చేసినవే కావడం విశేషం. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్కు కామెంటేటర్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.