
హైదరాబాద్: సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత క్రికెట్లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. గెలవడం అసాధ్యమనుకున్న మ్యాచ్ను వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లు(376 పరుగుల) అద్భుత భాగస్వామ్యంతో భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ భారత క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో కూడా ఓ మైలురాయిగా నిలిచిపోయింది.
2001 మార్చి 14 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరిగింది. గంగూలీ నాయకత్వంలోని టీమిండియా తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. వీవీఎస్ లక్ష్మణ్ (59) మినహా మిగతా బ్యాట్స్మన్ విఫలం కావడంతో భారత్ కేవలం 171 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లలో కెప్టెన్ స్టీవ్వా(110), హెడెన్ (97), లాంగర్లు (58) పరుగులతో రాణించడంతో 445 పరుగులు చేసింది. దీంతో తన తొలి ఇన్నింగ్స్లో 274 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలోఆన్లో పడి భారత్ తిరిగి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది.

ఇలాంటి సమయంలో మ్యాచ్ను ఏకపక్షంగా ఆస్ట్రేలియా గెలుస్తోందని భావించారు. అయితే అందరి అంచనాలను తలికిందులు చేస్తూ వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లు చెలరేగారు. ఏకంగా ఐదో వికెట్కు 376 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తద్వారా టెస్టుల్లో అత్యధిక స్కోరును లక్ష్మణ్ (289) సాధించగా ద్రవిడ్(180) పరుగులు నమోదు చేశారు.
దీంతో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ను 657 /7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 383 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆస్ట్రేలియాను హర్భజన్ సింగ్ 6 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. మరోవైపు సచిన్ టెండూల్కర్ మూడు వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు 212 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 171 పరుగులతో తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అప్పటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ బీసీసీఐ, వీవీఎస్ లక్ష్మణ్లు ఈ మ్యాచ్ గురించి ట్విట్టర్లో ప్రస్తావించారు. 'మనల్ని మనం నిరూపించుకోవాడనికి ఎదో ఒక రోజు అవకాశం వస్తుంది. అలాంటి రోజే నాకు 17 ఏళ్ల క్రితం వచ్చింది. దేశ సేవ కోసం వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. ఈ అవకాశం నా ఒక్కడికే కాదు ద్రవిడ్, సచిన్, హర్భజన్లతో జట్టు మొత్తానికి వచ్చింది' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.