హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించాడు. గత 25 ఏళ్లకు గాను భారత అత్యుత్తమ టెస్టు ఎలెవన్ జట్టును వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేశాడు. తన టెస్టు జట్టుకు కెప్టెన్గా మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీని లక్ష్మణ్ ఎంచుకోవడం విశేషం.
లక్ష్మణ్ అత్యుత్తమ జట్టులో మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్లతో పాటు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలకు చోటు కల్పించాడు. తన కలల టెస్టు జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్లను ఓపెనర్లుగా ఎంచుకోవడం విశేషం.
గంగూలీ కెప్టెన్సీలో అత్యధిక కాలం క్రికెట్ ఆడిన లక్ష్మణ్ మూడో స్థానాన్ని రాహుల్ ద్రవిడ్కే కట్టబెట్టాడు. రాహుల్ ద్రవిడ్తో కలిసి వీవీఎస్ లక్ష్మణ్ టెస్టుల్లో అత్యుత్తమ భాగస్వామ్యాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. 2001లో ఈడెన్ గార్డెన్స్లో వీరిద్దరూ కలిసి చేసిన 376 పరుగుల భాగస్వామ్యం ఇప్పటికీ భారత టెస్టు క్రికెట్లో ఓ చరిత్రే.
వీవీఎస్ అత్యుత్తమ భారత టెస్టు జట్టు ఇదే:
వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ(కెప్టెన్), ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), అనిల్ కుంబ్లే, భువనేశ్వర్ కుమార్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్