
హైదరాబాద్: క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పోటీపడే భారత్, న్యూజిలాండ్ జట్లూ రెండూ బలంగా ఉన్నాయని, అయితే కోహ్లీసేన ఫేవరెట్గా బరిలోకి దిగనుందని టీమిండియా మాజీ బ్యాట్స్మన్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీసేన సవాళ్లను చూసి ఏమాత్రం భయపడదని, ధైర్యంగా ముందుకు సాగుతుందన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన అందుకు మంచి నిదర్శనమని లక్ష్మణ్ పేర్కొన్నాడు. జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది.
తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ... 'ప్రస్తుతం రెండు జట్లూ బాగా ఆడుతున్నాయి. అయితే భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగునుంది. ఎందుకంటే కోహ్లీసేన గత రెండు మూడేళ్లుగానే కాకుండా కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తోంది. భారత్ సవాళ్లను ఎదుర్కొని, వచ్చిన అవరోధాలను దాటుకొని మరీ ముందుకు సాగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా సిరీసే అందుకు ఓ ఉదాహరణ. టీమిండియాలో ఇప్పుడు ఎంతో మంది నైపుణ్యమున్న ప్రతిభావంతులు ఉన్నారు. ఛాంపియన్షిప్ ఫైనల్ ఒక్క మ్యాచే అయినందున ఏ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ పరుగులు చేస్తుందో అదే జట్టు మ్యాచ్పై పట్టుబిగిస్తుంది' అని అన్నాడు.
'భారత క్రికెట్లో గత రెండు సంవత్సరాలుగా ఏమి జరిగిందో తెలిసిందే. ఎంతోమంది యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం చాలా బలమైన రిజర్వ్ బెంచ్ ఉంది. దేశీయ క్రికెట్ చాలా బలంగా ఉంది. చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీయడానికి మనకు అవకాశం ఉంది. రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ, ఐపీఎల్.. మనకు నాణ్యమైన ఆటగాళ్లను రూపొందించడానికి అసలు కారణాలు. దేశీయ, ఐపీఎల్ ద్వారా చాలా మందికి వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు లభించాయి. అందుకే జాతీయ జట్టులోకి వచ్చాక కూడా ఎలాంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. ఇది టీమిండియా అదృష్టమని నేను నమ్ముతున్నా. ఇది ఇతర దేశాలకు సమస్య కావచ్చు. ఎందుకంటే టాలెంట్ పూల్ మనకు అందుబాటులో ఉన్నంత లోతుగా వారికీ లేదు' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
'ఇంగ్లీష్ గడ్డపైకి న్యూజిలాండ్ ముందుగానే వెళ్లిందని.. టీమిండియా వెనుకంజలో ఉందనుకోవద్దు. ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వారికి తెలుసు. ఆస్ట్రేలియాలో భారత జట్టు పోరాటం, సానుకూల దృక్పథాన్ని మనం చూశాం. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు కోహ్లీసేన కఠోరంగా సాధన చేస్తుంది. ఇది లభించే అంశమే' అని హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ చేరుకున్న భారత క్రికెటర్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాంప్టన్లో బస చేస్తున్న ప్లేయర్లు ఒకరినొకరు కలుసుకునే వీలు లేకుండా క్వారంటైన్లో గడుపుతున్నారు.