'ప్రేక్షకులు లేకుండా.. కొన్ని వేదికల్లో ఐపీఎల్ 2020'

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిరవధిక వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఈ ఏడాది జరుగుతుందని భారత బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ పదమూడో సీజన్ నిర్వహణకు ఇంకా అవకాశాలున్నాయని, మూడు లేదా నాలుగు మైదానాలున్న నగరాలను ఎంచుకుని మ్యాచ్లు నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి లక్ష్మణ్ సూచించారు.

ఐపీఎల్ నిర్వహించేందుకు అవకాశాలున్నాయి:
తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ... 'ఈ ఏడాది ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు కచ్చితంగా అవకాశాలున్నాయి. బీసీసీఐ, ప్రాంచైజీలు అందరూ ఒకే మాట మీద ఉండేలా చూడాలి. మూడు లేదా నాలుగు మైదానాలున్న నగరాలను గుర్తించాలి. ఆటగాళ్లు తరచుగా ఎక్కువ దూరం ప్రయాణించడం సవాలుతో కూడుకున్న పని కాబట్టి ఒక్క చోటనే ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశాన్ని పరిశీలించాలి. విమానాశ్రయంలో ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. కాబట్టి ఫ్రాంఛైజీలు, బీసీసీఐ ఈ విషయంపై దృష్టి పెట్టాలి' అని లక్ష్మణ్ సూచనలు చేసారు.

ఖాళీ స్టేడియాల్లో:
ఐపీఎల్ ఈ ఏడాదే జరుగుతుందని టీమిండియా మాజీ కెప్టెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ ఫ్యాన్స్ లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరుగుతుందని జంబో అన్నారు. 'ఈ ఏడాదే ఐపీఎల్ 2020 జరుగుతుందని ఇప్పటికే నమ్మకం ఉంది. అయితే స్టేడియంలలో ప్రేక్షకులు ఉండే అవకాశం లేదు. మూడు లేదా నాలుగు వేదికలు ఉంటాయి. ఐపీఎల్ జరగడానికి ఇప్పటికీ అవకాశం ఉందనే అనిపిస్తుంది, ఎందుకంటే మనం అందరం ఆశావాదులమే' అని పేర్కొన్నారు.

ప్రపంచకప్ వాయిదా పడితే:
ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ అయి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు మరో 15 రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగా ఈ మెగా టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. 2022కు వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేశాల బోర్డు సభ్యులతో పొట్టి ప్రపంచకప్ నిర్వహణ అంశంపై ఐసీసీ మరోసారి (జూన్ 10 తర్వాత) చర్చించనుంది. అయితే వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రపంచకప్ వాయిదా పడితే.. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఐపీఎల్ నిర్వహించుకోవడానికి మార్గం సుగుమం అవుతుంది.

ఐపీఎల్ 2020 వాయిదా:
వైరస్ కారణంగా దాదాపు మూడు నెలలుగా క్రీడాలోకం నిలిపోయింది. కరోనా దెబ్బకు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. అక్టోబర్ నెలలో ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా అన్ని దేశాల బోర్డు సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications