హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్కప్ నాటికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పక ఫామ్ అందుకుంటాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు టీ20ల నుంచి ధోనిని తప్పించిన సెలక్టర్లు అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.
WATCH: తమ్ముడిని రక్షించేందుకు స్టంపింగ్ వదిలేసిన పాక్ క్రికెటర్(వీడియో)
దీంతో వచ్చే ఏడాది జనవరి నెల వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ధోనికి లేకపోయింది. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్ ముగిసిన అనంతరం 4 టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరిస్ ఆడనుంది. ఆసీస్తో మూడు వన్డేల సిరిస్ కోసం సెలక్టర్లు ఇంకా జట్టుని ప్రకటించలేదు. ఈ వన్డే సిరిస్కు ధోని ఎంపిక కాకపోతే 2019 వరల్డ్ కప్లో ధోని ఆడటం అనుమానమే.
ఈ నేపథ్యంలో ధోని భవితవ్యం గురించి తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "ధోని దిగ్గజ ఆటగాడు. 2019 వరల్డ్కప్లో అతడు జట్టులో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని నా నమ్మకం. క్రికెట్ ప్రపంచంలో ఇప్పటికీ ధోనీనే అత్యుత్తమ వికెట్ కీపర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతడు ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడు" అని అన్నాడు.
"2018 ఐపీఎల్ సీజన్లో ధోని బ్యాటింగ్ నన్ను ఆకట్టుకుంది. చాలా స్వేచ్ఛగా ఆడాడు. అతను అలా ఆడితే, ప్రత్యర్థి జట్టు మ్యాచ్పై ఆశలు వదులుకోవాల్సిందే. 2019 వరల్డ్కప్లోనూ ధోని తన సహజసిద్ధమైన ఆట ఆడితే తప్పక రాణిస్తాడు. ఇందుకోసం అతడు ముందే ఫామ్ను అందుకోవాల్సి ఉంటుంది" అని లక్ష్మణ్ వెల్లడించాడు.