
ముంబై: భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఐపీఎల్ 2020 ఎంతో కీలకం. ఆ టోర్నీలో రాణిస్తే వచ్చేఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కేందుకు అవకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. బంగర్ వ్యాఖ్యలతో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ విభేదించారు. ప్రపంచకప్నకు కుల్దీప్ ఎంపికవడం కష్టం అని అంటున్నారు. ఆసీస్లో యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ సత్తా చాటగలడని ధీమా వ్యక్తం చేశారు.
తాజాగా లక్ష్మణ్ మాట్లాడుతూ... 'గత సంవత్సరం వెస్టిండీస్తో జరిగిన టీ20లో కుల్దీప్, కృనాల్ కీలక పరుగులు చేశారు. అయినా సుందర్ను ప్రోత్సహిస్తా. పవర్ప్లే, డెత్ ఓవర్లలోనూ బాగా బౌలింగ్ చేస్తాడు. ఇది టీమిండియాకు లాభించే అంశం. సుందర్ ఆసీస్ పిచ్లపై మరింత బౌన్స్ రాబట్టగలడు. క్రీజును ఉపయోగించుకోవడం, బంతిని విడుదల చేసే విధానంతో బౌన్స్ చేయగలడు' అని అన్నారు.
'ఆసీస్లో బంతిని అంతగా టర్న్ చేయాల్సిన అవసరం లేదు. భారీ మైదానాలు కావడంతో వేగంలో మార్పులు చేస్తూ.. బౌన్స్ రాబట్టాలి. ఇది సుందర్ చేస్తాడు. అందుకే.. కుల్దీప్కు చోటు కష్టమని అనుకుంటున్నా. అయితే ప్రపంచకప్ ముందు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు' అని లక్ష్మణ్ పేర్కొన్నారు. డిసెంబర్ 6 నుండి భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్లో కుల్దీప్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత కుల్దీప్కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు.
ఇంతకుముందు బంగర్ మాట్లాడుతూ... 'కుల్దీప్ మంచి బౌలర్. అతని స్ట్రైక్ రేట్లకు పెద్ద అభిమానిని. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లాండ్లో కూడా ఐదు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2019 సీజన్ కుల్దీప్కు కలిసిరాలేదు. కొన్ని మ్యాచ్లలో రాణించకపోవడంతో అతన్ని పక్కనపెట్టారు. అందుకే ఐపీఎల్ 2020 ఎంతో కీలకం. ఆ టోర్నీలో రాణిస్తే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. అతడు రాణిస్తే జట్టు నుంచి పక్కన పెట్టడం కష్టం' అని బంగర్ చెప్పుకొచ్చారు.