హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెర్లిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అతనికి జీవితకాల సభ్యత్వం అందజేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎంసీసీ క్లబ్లో భారత్ నుంచి మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, జహీర్ ఖాన్లు మాత్రమే ఈ సభ్యత్వాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడాడు. 'ప్రతిష్టాత్మక, చరిత్రాత్మక క్రికెట్ క్లబ్లో సభ్యునిగా ఎంపికకావడం నిజంగా ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. క్లబ్కు ఉన్న గొప్ప వారసత్వాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. అద్భుతమైన సంస్కృతి కలిగిన క్లబ్లో భాగమవుతున్న నేను క్లబ్ ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను' అని లక్ష్మణ్ చెప్పాడు.
16 ఏళ్ల పాటు సుదీర్ఘంగా టీమిండియాకి ప్రాతినిథ్యం వహించిన వీవీఎస్ లక్ష్మణ్ 134 టెస్టులాడి 17 సెంచరీలు, 56 అర్ధ సెంచరీల సాయంతో 8,871 పరుగులు చేశాడు. వన్డేలకు తొందరగానే రిటైర్మెంట్ ఇచ్చినా ఆడిన 86 వన్డేల్లోనే 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో 2,338 పరుగులు చేశాడు.
జూన్, 2012న లక్ష్మణ్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడి కెరీర్కి వీడ్కోలు చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మెంటార్గా పనిచేస్తున్నాడు. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో వీవీఎస్ లక్ష్మణ్ మూడు టెస్టు మ్యాచ్లు ఆడాడు.