హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ వోజెస్ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏడాదిన్నరకే వీడ్కోలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత 35 ఏళ్ల వోజెస్ 2015 జూన్లో ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఆ తర్వాత వోజెస్ ఆడిన 20 టెస్టుల్లో 61.87 యావరేజితో 1485 పరుగులు చేశాడు. గతేడాది నవంబర్లో మూడు టెస్టుల సిరిస్లో భాగంగా హోబర్ట్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్ అతనికి చివరి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ టెస్టు అనంతరం వోజెస్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు.

అతడి స్ధానంలో పీటర్ హ్యాండ్స్కోంబ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే కనీసం 20 మ్యాచ్లాడిన వాళ్లలో డాన్ బ్రాడ్మన్ (99.94) తర్వాత అత్యధిక యావరేజి నమోదు చేసిన ఆటగాడిగా వోజెస్ నిలిచాడు. వయసు మీద పడటం, చివరగా ఆడిన సఫారీల సిరీస్లో విఫలమవడం వోజెస్ రిటైర్మెంట్కు కారణమైంది.
ఇదిలా ఉంటే వోజెస్ 2007లోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేశాడు.31 వన్డేలాడి 870 పరుగులు సాధించగా, 7 అంతర్జాతీయ టీ20ల్లో 139 పరుగులు చేశాడు.