విశాఖపట్నం: తుఫాన్ ప్రభావం కారణంగా భారత్-న్యూజిలాండ్ మధ్య సిరిస్ ఫలితాలన్ని నిర్ణయించే ఐదో వన్డే జరగేదేమో అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలహీనపడిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీంతో విశాఖపట్నంలో శనివారం జరగనున్న వన్డే మ్యాచ్ యధావిధిగా జరగొచ్చని తెలుస్తోంది. 'కయాంత్' తుఫాను ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో విశాఖ వన్డేపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తుఫాను బలహీనపడి వాయుగుండం దిశను మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో విశాఖ వన్డేకు ముప్పు తప్పినట్లేనని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కాగా విశాఖలో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఐదో వన్డే కోసం ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశామని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, పోర్టు ట్రస్టు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు.
స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం అవకాశం ఉన్నా మ్యాచ్ నిర్వహించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామన్నారు. షెడ్యూల్ సమయానికి గంటన్నర ముందు వర్షం తెరిపిచ్చినా మ్యాచ్ యథాతథంగా జరుగుతుందన్నారు.

'విశాఖ'కు చేరుకున్న ఇరు జట్లు: మ్యాచ్పై నీలినీడలు
మ్యాచ్ మధ్యలో వర్షం వచ్చినా తెరిపిచ్చిన తర్వాత వీలైనంత త్వరగా మైదానాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. మరోవైపు ఐదో వన్డే కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు గురువారం ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్లో బస చేస్తున్నారు.
కాగా న్యూజిలాండ్ ఆటగాళ్లు కొందరు గురువారం సాయంత్రం నగరంలోని సీఎంఆర్ సెంట్రల్ను సందర్శించారు. టీమిండియా కెప్టెన్ ధోనీ, కోహ్లీ, రహానె, రోహిత్తోపాటు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇక్కడికి వచ్చారు. శుక్రవారం ఉదయం టీమిండియా, మధ్యాహ్నం న్యూజిలాండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు.