
హైదరాబాద్: మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో అనేక రికార్డులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తద్వారా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ఈ వన్డేతో గతంలో జరిగిన మూడు విషయాలకు అవినాభావ సంబంధం కుదిరింది. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించే క్రమంలో తీసుకున్న బంతులతో పాటు, తేదీ, శ్రీలంక పరిమితమైన స్కోరు పరంగా చూస్తే.. 2014లో శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ను గుర్తుకు తెచ్చింది.
బుధవారం(డిసెంబర్ 13) మొహాలీ వేదికగా జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ 151 బంతుల్లో డబుల్ సెంచరీని నమోదు చేయగా, గతంలో శ్రీలంకతో డబుల్ సెంచరీ నమోదు చేసిన సమయంలో 151 బంతులనే తీసుకోవడం విశేషం. అంతేకాదు అప్పుడు రోహిత్ డబుల్ సెంచరీ చేసిన మ్యాచ్ 13వ తేదీనే జరగ్గా, తాజాగా డబుల్ సెంచరీ చేసిన మ్యాచ్ కూడా 13వ తేదీన జరిగింది.
ఈ రెండు సార్లు శ్రీలంక జట్టు 251 పరుగులకే పరిమితం కావడం విశేషం. ఇది యాధృచ్చికంగా జరిగినప్పటికీ... ఆసక్తికరంగా మారింది. అలాగే సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మలు డబుల్ సెంచరీలు సాధించిన సందర్భంలో భారత్ 153 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం.
ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. కాగా, 2013లో ఆస్ట్రేలియాపై తొలిసారి రోహిత్ శర్మ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత డిసెంబర్ 13వ తేదీన జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు సాధించాడు.
ఇదే వన్డేల్లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజాగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తద్వారా వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.