Sunrisers Hyderabad: ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచులో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా తనంతట తానే మైదానాన్ని వీడటం ప్రస్తుతం భారత క్రికెట్లో, ఫ్యాన్స్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఇషాన్ కిషన్ పెవిలియన్కు చేరిన తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ పై దారుణంగా విమర్శలు చేశాడు. ప్రస్తుతం ఇషాన్ ఔట్ అంశంతో పాటు సెహ్వాగ్ అన్న వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ సెహ్వాగ్ ఏం అన్నాడంటే?
ఐపీఎల్ 2025లో 41వ మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో సన్రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. అప్పుడు హెడ్ ఔటయ్యాక.. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఇషాన్ బ్యాట్ను మిస్సై వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి వెళ్లింది.
అయితే బంతికి బ్యాట్కు తాకిందని భావించిన ఇషాన్ అంపైర్ ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినా.. పెవిలియన్ బాట పట్టాడు. రీ ప్లేలో బంతి బ్యాట్కు గానీ శరీరానికి కానీ తగల్లేదని తేలింది. దీంతో పెవిలియన్ చేరిన ఇషాన్ ను చూసి అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో ఇషాన్ ఔట్ తీరు.. తీవ్ర చర్చలకు దారీ తీసింది. ఇషాన్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని అంతా ఆరోపణలు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి డబ్బు తీసుకున్నాడని అంతా అంటున్నారు.

ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్ కూడా కీలక కామెంట్స్ చేశాడు. కనీసం అంపైర్ నిర్ణయం ప్రకటించే వరకు అయినా, ఇషాన్ క్రీజును వదలకుండా ఉండాల్సింది, అతడు అనవసరంగా తొందరపడి క్రీజును వీడాడని పేర్కొన్నాడు. "అలాంటి సమయంలో చాలా సార్లు మెదడు పని చేయదు. ఇది బ్రెయిన్ ఫేడ్. కనీసం అంపైర్ నిర్ణయం ఏంటనేది తెలుసుకునేవరకు అయినా ఆగాల్సింది. ఎందుకంటే అంపైర్ కూడా తన పనికి జీతం తీసుకుంటున్నాడు కదా. అతడిని తన పనిని చేయాల్సినివ్వాల్సింది."
"అసలు ఇది ఎలా జరిగిందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఇషాన్ కిషన్ స్పోర్ట్స్మాన్షిప్ కోణంలో తానే ఔటైనట్టు భావించి వెళ్లిపోయాడని అనుకుందాం. కానీ అది ఔట్ కాదు. అదే సమయంలో అంపైర్ కూడా అతడు ఔట్ అయ్యాడా లేదా అన్న సందేహంలో ఉన్నాడు. పైగా ఇషాన్ కూడా సడెన్ గా మైదానాన్ని వదిలి వెళ్లిపోవడం ఎంతో అయోమయంగా అనిపించింది." అని సెహ్వాగ్ అన్నాడు.