Virender Sehwag: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తక్కువ బంతులు ఆడటం పట్ల ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. గత కొన్ని సీజన్లుగా ఇది జరుగుతోంది. ధోని బ్యాటింగ్ ఆర్డర్ కంటే బంతులపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతాడు. ఎప్పుడు బ్యాటింగ్కు రావాలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాడు. కానీ అభిమానులు 9వ స్థానంలో ఎంఎస్ ధోని బ్యాటింగ్ను జీర్ణించుకోలేకపోతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఎంఎస్ ధోని 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ధోని కంటే ముందు సామ్ కరణ్, శివం దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్కు వచ్చారు.
ధోని తన అత్యుత్తమ ఆటతీరులో వారందరి కంటే మెరుగ్గా ఉన్నాడు. కానీ బ్యాటింగ్ ఆర్డర్ లో 9వ స్థానంలో బ్యాటింగ్ చేయాలనే ఎంఎస్ ధోని నిర్ణయం ఊహించలేనిది. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కీలక దశలో కూడా ధోని లోయల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తీవ్రంగా స్పందించాడు. సెహ్వాగ్ 8 సంవత్సరాలుగా ధోనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ధోని చాలా త్వరగా బ్యాటింగ్కు వచ్చాడే.. అంటూ వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్ వేశాడు. ఎందుకంటే ధోని సాధారణంగా ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడని.. సెహ్వాగ్ నవ్వుతూ అన్నాడు. ఎంఎస్ ధోని తొందరగా బ్యాటింగ్ కు వచ్చాడా? లేదంటే మిగతా బ్యాటర్లు త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ధోనిని రప్పించారా అంటూ సెహ్వాగ్ వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత క్రిక్ బజ్లో జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన కార్యక్రమంలో సెహ్వాగ్ ఈ విషయం చెప్పాడు. భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ధోని 10వ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని అనిపించిందని అన్నాడు.

డెత్ ఓవర్లకు ముందు బ్యాటింగ్కు రాకూడదని ధోని నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ధోని వచ్చేసరికి అప్పటికే 16 ఓవర్లు అయిపోయాయి. సాధారణంగా ఎంఎస్ ధోని 19వ లేదా 20వ ఓవర్ లో వస్తాడని.. కాబట్టి ధోని త్వరగా బ్యాటింగ్ చేయడానికి వచ్చాడని వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు. మ్యాచ్ చివరి రెండు ఓవర్లలో ధోని మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఎంఎస్ ధోని 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ధోని స్ట్రైక్ రేట్ 187.5 గా ఉంది. శుక్రవారం సీఎస్కే బ్యాటర్ల కంటే మెరుగ్గా ఉంది. కానీ 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని.. ప్రతి సీఎస్కే అభిమాని మనసులో ప్రతిధ్వనిస్తోంది.
యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని ఎంఎస్ ధోని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. యువ ఆటగాళ్లు భారత టీ20 జట్టులోకి రావాలని ఎంఎస్ ధోని కోరుకుంటున్నాడు. కానీ ఆర్సీబీపై 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అభిమానులకు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా అవసరమైన రన్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ధోని అశ్విన్ కంటే పైన బ్యాటింగ్ చేసి ఉండాల్సిందని అభిమానులు భావిస్తున్నారు.