పాకిస్థాన్ టెస్టు జట్టులో చోటు కోల్పోయిన స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్కు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు చేశాడు. బాబర్ దేశవాళీ క్రికెట్ ఆడాలని, అలాగే శారీరకంగానే కాకుండా మానసికంగా ఫిట్నెస్ సాధించి తిరిగి పాక్ జట్టులోకి రావాలని సూచించాడు. షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్లో పాల్గొన్న సెహ్వాగ్ బాబర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్తో రెండు, మూడు టెస్టులకు బాబర్ అజామ్ను ఎంపిక చేయని విషయం తెలిసిందే. బాబర్తో పాటు అనుభవజ్ఞులైన షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్లను కూడా పాక్ బోర్డు పక్కనపెట్టింది. అయితే బాబర్ను జట్టు నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయాన్ని క్రికెటర్లు, మాజీలు వ్యతిరేకించారు. మరోవైపు బాబర్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ సెంచరీతో కదం తొక్కాడు.

''బాబర్ అజామ్ దేశవాళీ క్రికెట్ ఆడాలి. అతని ఫిట్నెస్పై దృష్టిసారించాలి. అలాగే కుటుంబంతో సమయాన్ని గడపాలి. శారీకంగా, మానసికంగా దృఢత్వం సాధించి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రావాలి. అయితే ప్రస్తుతం బాబర్ తనపై అంచనాలు కోల్పోయాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతనిపై ఆటలో టెక్నిక్ పరంగా మానసికంగా ప్రభావం చూపించినట్లు ఉంది. అతను మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. అతనికి ఎంతో నైపుణ్యం ఉంది. అతనిలాంటి ప్లేయర్లు తిరిగి త్వరగా పుంజుకోగలరు'' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇటీవల బాబర్ అజామ్ వన్డే, టీ20లకు పాక్ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా, 2022 డిసెంబర్ తర్వాత నుండి బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్పై కూడా ఇంగ్లండ్తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు చేశాడు. ఓవరాల్గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు.