టీమిండియా చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ అంతటి విధ్వంసకర ఓపెనర్ మరొకరు లేరు. బౌలింగ్ చేస్తుంది ఎవరైనా సరే, తనదైన స్టైల్లో వెల్కమ్ చెప్పడం అతనికి అలవాటు. అలాంటి సెహ్వాగ్ను ఒక బౌలర్ తెగ ఇబ్బంది పెట్టేవాడట. అతని బౌలింగ్లో ఆడాలంటేనే తనకు భయం వేసేదని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు.
ఆ బౌలర్ మరెవరో కాదు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్. 'నేను అవుట్ అయిపోతానని భయపడిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్. అందరూ మాత్రం షేన్ వార్న్, మెక్గ్రాత్, షోయబ్ అక్తర్, బ్రెట్ లీ అంటే నాకు భయం అనుకున్నారు. కానీ వీళ్ల బౌలింగ్లో అవుట్ అవుతానని ఎప్పుడూ టెన్షన్ పడలేదు' అని సెహ్వాగ్ చెప్పాడు.

అయితే తనకు మాత్రం ఈ లెజెండరీ బౌలర్లు అంటే ఎలాంటి టెన్షన్ ఉండేది కాదని సెహ్వాగ్ తెలిపాడు. 'నా హెల్మెట్ మీదనో, శరీరానికో ఈ పేసర్లు వేసే బంతులు తగులుతాయని అనుకునేవాడిని. ఇక మెక్గ్రాత్ బౌలింగ్లో పరుగులు చేయడానికి కష్టపడాల్సి వస్తుందనేదే నా భయం' అని వివరించాడు. అంతేకానీ, ఎవరూ కూడా తనను మురళీ ధరన్ భయపెట్టినట్లు మాత్రం భయపెట్టలేదని స్పష్టం చేశాడు.
'మురళీధరన్ బౌలింగ్లో నాకు భయం వేసేది. నన్ను ఎక్కడ అవుట్ చేస్తాడో అని టెన్షన్ పడేవాడిని. అతను వేసే దూస్రాను పసిగట్టడం కుదిరేది కాదు' అని చెప్పాడు. అయితే తను స్పిన్నర్లను బౌలర్లుగానే గుర్తించనని సెహ్వాగ్ అన్నట్లు సమాచారం. అశ్విన్ కూడా ఇదే విషయం చెప్పాడు. దీన్ని మరోసారి నిజమే అని చెప్పిన సెహ్వాగ్.. మురళీధరన్ బౌలర్ అంటే తాను ఒప్పుకోనని, కానీ అవుట్ అవుతానని భయంగా ఉండేదని వివరించాడు. తన బౌలింగ్ ఎదుర్కోవడానికి తనకు చాలా కాలం పట్టిందని తెలిపాడు.