
హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్లు ఒకే మ్యాచ్లో ప్రత్యర్ధులుగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. నిజానికి అక్తర్ బౌండరీ లైన్ వద్ద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బౌన్సర్ సంధిస్తే, సెహ్వాగ్ అలవోకగా దానిని ఫోర్గా మలచిన సందర్భాలు అనేకం.
ఇలాంటి దృశ్యం మరోసారి అభిమానులకు కనువిందు చేయనుంది. అయితే ఇది క్రికెట్ గ్రౌండ్లో కాదు. ఓ ప్రత్యేకమైన మైదానంలో. స్విట్జర్లాండ్లోని సెయింట్ మోరిట్జ్లో గడ్డ కట్టిన సరస్సుపై వచ్చే ఏడాది రెండు ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్లను నిర్వహించనున్నారు. అయితే అక్కడ ఐస్ క్రికెట్ కొత్త కాదు.

దాదాపు మూడు దశాబ్దాల క్రితమే 1988లో ఈ ఆట మొదలైంది. కానీ అంతర్జాతీయ క్రికెటర్లు మాత్రం ఇందులో ఎన్నడూ తలపడలేదు. అయితే ఈసారి జరిగే ఈ మ్యాచ్ల్లో సెహ్వాగ్, అక్తర్లతో పాటు.. మహ్మద్ కైఫ్, మహేల జయవర్ధనె, లసిత్ మలింగ, మైకెల్ హసి, గ్రేమ్ స్మిత్, జాక్వస్ కలిస్, వెటోరి, నాథన్ మెక్కలమ్, గ్రాండ్ ఇలియట్, మాంటీ పనేసర్, ఒవైస్ షా కూడా ఆడనున్నారు.
ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో జరిగే ఐస్ టి20 మ్యాచ్ల్లో ఆడేందుకు వీరూ లాంటి స్టార్స్కు రూ. 32.50 లక్షలు (50 వేల డాలర్లు), మిగతా వారికి 19.50 లక్షలు (30 వేల డాలర్లు) పార్టిసిపేషన్ ఫీజుగా చెల్లించనున్నారు. 'క్రికెట్కు దూరమై దాదాపుగా రెండేళ్లవుతోంది. మళ్లీ లయ దొరకబుచ్చుకోవడం సవాలే. మంచుపై క్రికెట్ అనగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది. అందుకే మరేం అలోచించకుండా ఆడేందుకు అంగీకరించాను' అని సెహ్వాగ్ చెప్పాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.