న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురువారం 38వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సెహ్వాగ్కు మాజీ ఆటగాళ్లు, తన సహచర ఆటగాళ్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్లో అందరినీ ఆటపట్టిస్తూ, మాజీ ఆటగాళ్లకు తనదైన శైలిలో పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. అభిమానులు నవాబ్ ఆఫ్ నజఫ్గఢ్గా పిలుచుకునే సెహ్వాగ్కు గురువారం ఉదయం నుంచే పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
'#HappyBirthdayViru' అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్గా సెహ్వాగ్ చాలా బిజీ లైఫ్ను గడుపుతున్నారు. భారత్ తరుపున 104 టెస్టులాడిన సెహ్వాగ్ 8586 పరుగులు చేయగా, 251 వన్డేలాడిన 8273 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
2008లో దక్షిణాఫ్రికాతో చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్లో సెహ్వాగ్ 319 పరుగులు సాధించాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా టెస్టుల్లో, వన్డేల్లో ఓపెనర్ గా 7,500కి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మన్ సెహ్వాగ్ ఒక్కడే. టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో ట్రిపుల్ సెంచరీ(278 బంతులు) సాధించాడు.
2002లో అర్జున అవార్డు, 2008, 2009లో విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డులు, 2010లో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2010లో పద్మశ్రీ అవార్డులను సెహ్వాగ్ అందుకున్నాడు.
సెహ్వాగ్ సాధించిన రికార్డులు:
* టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెకండ్, థర్డ్ డబుల్ సెంచరీలు. అలాగే టెస్టుల్లో 10 వేగవంతమైన డబుల్ సెంచరీల్లో 5 సెహ్వాగ్ వే.
* వన్డే మ్యాచ్లో మూడో అత్యధిక స్కోరు సెహ్వాగ్ దే.
* టెస్ట్ ఇన్నింగ్స్ లో 47 ఫోర్లు బాదిన సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 52 ఫోర్లతో జాన్ ఎడ్రిచ్ తొలి స్థానంలో ఉన్నాడు.
* ఒక వన్డే మ్యాచ్ లో అత్యధిక ఫోర్లు (25) బాదిన జాబితాలో సెహ్వాగ్ ది రెండో స్థానం.
* వరుసగా 11 సెంచరీలను సెహ్వాగ్ 150+ స్కోరుగా మలిచాడు.
* టెస్ట్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు, ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ సెహ్వాగ్.
* టెస్టుల్లో 5 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 8 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
* వన్డేల్లో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.