Virender Sehwag: ఆసియా కప్ 2025లో భాగంగా భారత జట్టు పాకిస్తాన్ను వరుసగా రెండో సారి ఓడించింది. సూపర్-4 మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ముఖ్యంగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ పాకిస్తానీ బౌలర్లను స్లెడ్స్ చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. క్రికెట్లో బౌలర్ బ్యాటర్ను రెచ్చగొట్టడం సాధారణం. కానీ ఈ సారి బ్యాటర్లు దీటుగా బదులిచ్చారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.
మ్యాచ్లో ఘర్షణలు
పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 171 పరుగులు చేసింది. ఇది మంచి స్కోరే అయినప్పటికీ భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మొదటి బంతి నుంచే పాకిస్తానీ బౌలర్లపై దాడి చేయడం మొదలుపెట్టారు.

షాహీన్ అఫ్రిదితో అభిషేక్: ఇన్నింగ్స్ మొదటి బంతిని సిక్సర్ కొట్టిన తర్వాత అభిషేక్ శర్మ పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదిని స్లెడ్జ్ చేశాడు. దీనికి ప్రతీకారంగా, తర్వాతి ఓవర్లో గిల్ రెండు ఫోర్లు కొట్టి, షాహీన్ వైపు చూస్తూ ఏదో అన్నాడు.
హారిస్ రౌఫ్తో గిల్, అభిషేక్: ఐదో ఓవర్లో హారిస్ రౌఫ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు.. మొదట అతను అభిషేక్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. అయితే గిల్ ఆ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టిన తర్వాత రౌఫ్ను స్లెడ్జ్ చేశాడు. ఆ తర్వాత నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అభిషేక్ కూడా రౌఫ్తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ మధ్యలో వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు.
ఆశ్చర్యపోయిన వీరేంద్ర సెహ్వాగ్
ఈ ఘర్షణల సమయంలో కామెంటరీ చేస్తున్న భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆశ్చర్యపోయాడు. "బహుశా ఇది మొదటిసారి అనిపిస్తుంది. బ్యాటర్లే బౌలర్లను స్లెడ్జ్ చేస్తున్నారు" అని ఆయన తన కామెంటరీలో పేర్కొన్నాడు. సాధారణంగా, బౌలర్లు బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు, కానీ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్ల అహంకారానికి భారత బ్యాటర్లు తమ బ్యాట్తోనే కాకుండా, మాటలతో కూడా సమాధానం ఇచ్చారు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పాకిస్తానీ బౌలర్లకు బౌండరీ లైన్ వైపు వేలు చూపిస్తూ వెక్కిరించడం కూడా కనిపించింది.
ఈ సంఘటనలు మైదానంలో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ఆటగాళ్లు ముందుగా చేసిన నాటకాలకు ఇవి ఒక ప్రతీకారంగా నిలిచాయి. గ్రూప్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్తో చేతులు కలపకపోవడంతో ఈ మ్యాచ్ను పాకిస్తాన్ ప్రతీకార మ్యాచ్గా భావించింది, కానీ వారికి మరో ఓటమి తప్పలేదు.