IPL 2025 CSK: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా జరిగిన మ్యాచులో కోల్కతా నైట్ రైడర్స్ పై కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచులో ధోనీ ఔటైన తీరు వివాదానికి దారీ తీసింది. మహీ నాటౌట్ అయినా.. అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల క్రీజు వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయంపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్.. ధోనీని, చెన్నై జట్టును దారుణంగా విమర్శించాడు.
మహా అయితే అరగంట ఆలస్యంగా..
ఒకవేళ ధోనీ నాటౌట్ అయితే.. అంత మాత్రాన మ్యాచ్ ఫలితం ఏం మారేది కాదని అన్నాడు సెహ్వాగ్. మహా అయితే 103 పరుగులు చేసిన సీఎస్కే 130 పరుగులు చేసేదని, కేకేఆర్ కు విజయం మరో అరగంట ఆలస్యంగా వచ్చేది అని చెప్పాడు. "ఒకవేళ ధోనీ నాటౌట్ అయితే, మారేది ఏం లేదు. సీఎస్కే 130 పరుగులు చేసేది. కేకేఆర్ 103 పరుగులను 10.1 ఓవర్లలో చేరుకుంది. ఇంకొన్ని ఓవర్లు ఆడితే 130 కూడా చేరుకుంటుంది. 11 గంటలకు అందుకున్న విజయాన్ని, కేకేఆర్ ఓ అరగంట ఆలస్యంగా 11.30కి అందుకునేది." అంటూ సెటైరికల్ గా మాట్లాడాడు సెహ్వాగ్.

అసలు ఏం జరిగిందంటే?
ఈ మ్యాచులో ధోనీ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. కేవలం 4 బంతులే ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. సునీల్ నరైన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ధోనీ ఔట్ అయినట్లు కనపడగానే.. ముందుగా కోల్కతా అప్పీలు చేసింది. వెంటనే ఫీల్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. దీంతో మహీ రివ్యూకు వెళ్లాడు. కానీ సమీక్షలో ఆశించిన ఫలితం దక్కలేదు. బంతి బ్యాట్ అంచున తాకినట్లు కాస్త 'స్పైక్స్' వచ్చాయి. కానీ థర్డ్ అంపైర్ మాత్రం 'ఔట్'గానే ప్రకటించాడు. దీంతో అంపైర్ తప్పుడు నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సెహ్వాగ్ ధోనీ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పై సెటైర్లు వేశాడు.