
కెప్టెన్సీ భవిష్యత్తుపై నీలినీడలు
టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలకు విరాట్ కోహ్లీ ఇప్పటికే గుడ్ బై చెప్పగా.. వన్డే, టెస్టు ఫార్మాట్ల నుంచి కూడా అతడిని తప్పించాలని కొందరు సోషల్ మీడియాలో అంటున్నారు. దాంతో విరాట్ కెప్టెన్సీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్గా అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడని.. వన్డే, టెస్ట్లలో నాయకత్వ పాత్రను వదిలకూడదని వీరూ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ మిగతా రెండు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకోవాలా వద్దా అనే ఓ అభిమాని ప్రశ్నకు సెహ్వాగ్ ఇలా స్పందించాడు.

వన్డే, టెస్టుల్లో సారథ్యం చేయాలి
'కెప్టెన్సీ అనేది విరాట్ కోహ్లీ సొంత నిర్ణయం. కానీ కోహ్లీ మిగిలిన రెండు ఫార్మాట్ల (వన్డే, టెస్టు) కెప్టెన్సీని విడిచిపెడతాడని నేను అనుకోను. కేవలం ఆటగాడిగా ఆడాలనుకుంటే.. అది అతని నిర్ణయం. విరాట్ కెప్టెన్సీలో భారత్ బాగా ఆడుతుంది. కెప్టెన్గా అతని రికార్డు అద్భుతమైనది. భాతర్కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా పేరుగాంచాడు. కోహ్లీ చాలా తెలివైనవాడు, దూకుడు కెప్టెన్. భారత జట్టుకు ముందునుంచి నాయకత్వం వహిస్తున్నాడు. వన్డేలు, టెస్టులలో కెప్టెన్సీని వదిలివేయడం లేదా వదలకపోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. వన్డే, టెస్టుల్లో సారథ్యం చేయాలని నేను సూచిస్తున్నా' అని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

భారత్ ఆత్మపరిశీలన చేసుకోవాలి
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత భారత్ ఇంతవరకు ఐసీసీ టైటిల్ను గెలుచుకోలేదు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. ఐసీసీ టోర్నమెంట్లలో జట్టు పేలవ ప్రదర్శనకు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. 'ఇలాంటి సమయంలో అందరం జట్టుకు మద్దతు ఇవ్వాలని నాకు తెలుసు. కానీ భారత జట్టు చాలాకాలం నుంచి ఏ ప్రధాన ఐసీసీ టోర్నమెంట్ను గెలవలేకపోయింది. దీనిపై టీమిండియా కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ద్వైపాక్షిక సిరీస్లు గెలవడమే కాదు.. ప్రపంచ టోర్నీలను గెలిస్తేనే ప్రజలు మినల్ని గుర్తుంచుకుంటారు. ఈ విషయంపై బీసీసీఐ దృష్టి సారించాలి' అని వీరూ చెప్పుకొచ్చాడు.

32 టీ20 మ్యాచ్లో విజయాలు
టీమిండియాకు విరాట్ కోహ్లీ 50 మ్యాచుల్లో టీ20 జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. కోహ్లీ నాయకత్వంలో భారత్ 32 టీ20 మ్యాచ్లను గెలిచింది. మరో 16 మ్యాచ్లను ఓడిపోయింది. ఇక రెండు మ్యాచ్లలో ఫలితం రాలేదు. టీ20లలో కోహ్లీ సారథ్యంలో భారత్ ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా.. మంచి విజయాలు అందించాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. టెస్టులు, వన్డేలకు మాత్రం కోహ్లీనే పగ్గాలు చేపట్టనున్నాడని తెలుస్తోంది. టీమిండియా టీ20 మ్యాచ్లకు ఇక నుంచి కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ చేపడుతాడని కోహ్లీ నమీబియాతో మ్యాచ్లో చెప్పకనే చెప్పాడు. బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications












