
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ మీద.. లక్నో 153పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం గమనార్హం. పేసర్లు దుష్మంత చమీర, మోసీన్ ఖాన్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. ఇరువురు కలిపి 5 వికెట్లు పడగొట్టారు. దీంతో పంజాబ్ 20ఓవర్లలో 8వికెట్లకు 133పరుగులు మాత్రమే చేసి 19పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్లో లక్నో పేసర్లు అద్భుత ప్రదర్శనను అందించగా ఇక ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా క్రమశిక్షణతో కూడిన ప్రదర్శనతో సత్తా చాటాడు. ఈ బరోడా ప్లేయర్ తన 4ఓవర్లలో కేవలం 11పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తన మార్క్ బౌలింగ్తో జితేష్ శర్మ, భానుక రాజపక్సలను పెవిలియన్కు పంపించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. మెగావేలంలో అతనికి భారీ ధర దక్కడంపై వచ్చిన విమర్శకుల నోళ్లను అతని ప్రదర్శనతో మూయిస్తున్నాడంటూ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

ఐపీఎల్ మెగా వేలంపాట ఫిబ్రవరిలో జరిగిన సంగతి తెలిసిందే.. కృనాల్ పాండ్యా కోసం పలు ఫ్రాంచైజీలు వేలం మొదలెట్టాయి. అతని ధర అంతకంతకూ పెరుగుతూ పోయింది. చివరకు రూ.8.25కోట్లకు లక్నో అతన్ని కొనుగోలు చేసింది. అయితే అతనికి అంత ధర అవసరం లేదని అప్పట్లో విమర్శలొచ్చాయి. అతను అంత పెద్ద ఆల్ రౌండరేం కాదని నెట్టింట కామెంట్లు కూడా హోరెత్తాయి. తాజాగా ఈ ఐపీఎల్లో లక్నో తరఫున ఆడుతున్న కె.పాండ్యా తన సత్తా చాటుతున్నాడు.
అతని ప్రదర్శనపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. కృనాల్ పాండ్యా తన మీద పెట్టిన ప్రతి పైసాకు విలువ చేకూర్చే ఆటగాడినని నిరూపించుకుంటున్నాడని ప్రశంసించాడు. పాండ్యాకు టన్నుల కొద్దీ టీ20 మ్యాచ్ల అనుభవం ఉందని, లక్నో టీమ్ అతనికి చెల్లించిన దానికంటే అతను ఎక్కువే ఇస్తున్నాడని కొనియాడాడు.
కృనాల్ పాండ్యాకు వేలంలో ఎక్కువ ధర పలికిందని తాను అనుకోనని సెహ్వాగ్ చెప్పాడు. అతని దగ్గర ఆ ధరకు తగ్గ క్యాలిబర్, అనుభవం ఉందని పేర్కొన్నాడు. అతను తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ.. బాగా బౌలింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో తొమ్మిది వికెట్లు పడగొట్టిన కృనాల్.. తన బౌలింగ్ మెరుగు కావడానికి కారణాన్ని తెలిపాడు. భారత మాజీ స్పిన్నర్ రాహుల్ షాంఘ్వీ తన బౌలింగ్ ప్రదర్శనను మెరుగుపర్చడానికి ఎంతో సహాయపడ్డాడని తెలిపాడు.
గత 7,8 నెలలుగా.. నేను చాలా కష్టపడ్డాను అని పేర్కొన్నాడు. నా బౌలింగ్ డెలివరీల హైట్ పెంచుకున్నాను. అలాగే గ్రిప్ పరంగా కాస్త మార్పులు చేసుకున్నాను అని తెలిపాడు. ఇంకా బ్యాటింగ్ పరంగా నేను అనుకున్నంత రాణించలేదు. మున్ముందు బ్యాటింగ్లోను జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడతానని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.