ఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల కోసం అథ్లెట్లు, కోచ్లను ఎంపిక చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల సెలక్షన్ ప్యానెల్లో వీరేంద్ర సెహ్వాగ్కి చోటు దక్కింది. మొత్తం 12 మందితో కూడిన ఫ్యానల్లో సెహ్వాగ్తో పాటు హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, 2016 రియో పారాలింపిక్ రజత పతక విజేత దీపా మాలిక్ తదితరులకి అందులో చోటు లభించింది.
గతేడాది లాగే ఈ సారి కూడా అథ్లెట్లు, కోచ్ల ఎంపిక కోసం ఒకే సెలక్షన్ ప్యానెల్ను ప్రకటించారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ముకుందకం శర్మ నేతృత్వంలో ఈ ప్యానెల్ పనిచేయనుంది. టేబుల్ టెన్నిస్ మాజీ ప్లేయర్ మోనాలిసా బరువా మెహతా, బాక్సర్ వెంకటేశన్ దేవరాజన్, స్పోర్ట్స్ కామెంటేటర్ మనీష్ బతావియా, సోర్ట్స్ జర్నలిస్టులు అలోక్ సిన్హా, నీరూ భాటియా ఎంపిక కమిటీలో చోటు దక్కించుకున్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ తరఫున సాయ్ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, సంయుక్త కార్యదర్శి(క్రీడా అభివృద్ధి) ఎల్ఎస్ సింగ్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం(టాప్స్) సీఈవో రాజేశ్ రాజగోపాలన్ కమిటీలో ఉన్నారు.
'ఈ ఏడాది కూడా అన్ని అవార్డులను ఎంపిక చేసేందుకు ఒకే ప్యానెల్ను ఏర్పాటు చేశాం. ఒకటి కంటే ఎక్కువ కమిటీలను నియమించడం వల్ల విభిన్న అభిప్రాయాలు వచ్చి వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. ద్రోణాచార్య అవార్డుల కోసం కోచ్ల పేర్లను పరిగణలోకి తీసుకునేటప్పుడు.. అవసరం అనుకుంటే ద్రోణాచార్య అవార్డు గెలిచిన ఇద్దరిని అదనపు సభ్యులుగా తీసుకునే వెసులుబాటు ప్యానెల్ అధ్యక్షుడికి ఉంటుంది' అని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే క్రీడా పురస్కారాల కార్యక్రమం ఈ సారి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యంగా జరిగే అవకాశముంది. జాతీయ క్రీడా దినోత్సవంను భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్చంద్ గౌరవ సూచకంగా ఆయన పుట్టిన రోజైన ఆగష్టు 29న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం ఓ వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ప్రేక్షకుల నడుమ ఐపీఎల్ 2020!!