
ఈ ఐపీఎల్ సీజన్లో జడేజాను తమ కెప్టెన్గా నియమించాలని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్న నిర్ణయం అతి పెద్ద తప్పు అని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఇటీవల మళ్లీ ధోనీ తిరిగి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జడేజా నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 8మ్యాచ్లలో కేవలం 2మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో తను ఆట మీద ఫోకస్ చేయాలని భావిస్తున్నానని తిరిగి కెప్టెన్సీని ధోనీకి అప్పజెబుతానని రవీంద్రా జడేజా కెప్టెన్సీని వదులకున్నాడు. ఇక ఈ సీజన్లో దాదాపు ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన సీఎస్కేను ఉద్దేశించి వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. సీజన్ మొదట్లో ఎంఎస్ ధోనీ కెప్టెన్గా కాకుండా ప్లేయర్గా బరిలోకి దిగుతాడని సీఎస్కే ప్రకటించడం ఆ ఫ్రాంచైజీ చేసిన తొలి తప్పుగా సెహ్వాగ్ పేర్కొన్నాడు.
బుధవారం పూణేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 13పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. దాదాపు ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన ఆ జట్టును ఉద్దేశించి సెహ్వాగ్ తన ఒపినియన్ తెలిపాడు. సీఎస్కే ప్రస్తుతం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. సీజన్ ప్రారంభం నుంచి ధోనీ కెప్టెన్గా ఉండి ఉంటే చెన్నై జట్టు కథ వేరేలా ఉండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే వైఫల్యానికి బ్యాటర్ల పేలవమైన ఫామ్ ఓ ప్రధాన కారణమని పేర్కొన్నాడు. 'స్థిరమైన ప్లేయింగ్ 11జట్టు లేదు. రుతురాజ్ గైక్వాడ్ సీజన్ ప్రారంభంలో పరుగులు చేయలేకపోయాడు. చాలా పేలవంగా టోర్నీని ప్రారంభించాడు. బ్యాటర్లు అంతగా రాణించలేదు. సీజన్లో మొత్తం సీఎస్కే పరిస్థితి గందరగోళంగా తయారైంది. మొదటి నుంచి ధోనీ గనుక కెప్టెన్గా ఉండుంటే బాగుండేది. సీఎస్కే ఇన్ని మ్యాచ్లు ఓడిపోయేదే కాదు' అని సెహ్వాగ్ ప్రస్తావించాడు.
ఇక నిన్నటి మ్యాచ్లో 19వ ఓవర్లో ధోనీ ఔట్ అవ్వడం మ్యాచ్కే టర్నింగ్ పాయింట్ అని సెహ్వాగ్ చెప్పాడు. ధోనీ చివరి వరకు బ్యాటింగ్ చేస్తే 174పరుగులను ఛేదించడానికి సీఎస్కేకు ఒక ఎడ్జ్ ఉండేది. ఎంఎస్ ధోనీది అత్యంత ముఖ్యమైన వికెట్. హాజిల్వుడ్ మంచి లెంగ్త్లో బౌలింగ్ చేశాడు. అలాగే గ్లెన్ మాక్స్వెల్ సైతం 22పరుగులు ఇచ్చి ఉతప్ప, అంబటి రాయుడును ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడంటూ మ్యాచ్లో కీలక ఘట్టాలను సెహ్వాగ్ పేర్కొన్నాడు.