Virender Sehwag: 14 ఏళ్లకే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. తన ఐపీఎల్ అరంగేట్రం తొలి బంతికే సిక్స్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి మ్యాచ్లో వైభవ్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంత చిన్న వయస్సులోనే తన ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వైభవ్ సూర్యవంశీకి కీలక సలహా ఇచ్చాడు. తొలి విజయంతోనే తాను సంతోషంగా ఉంటే.. వచ్చే ఏడాది తాను ఆడటం కనిపించకపోవచ్చని అన్నాడు. వైభవ్ సూర్యవంశీ స్థిరంగా ఉండి ఎక్కువ కాలం ఆడాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు.
వైభవ్ గురించి వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడంటే?
రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ను వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్బజ్లో విశ్లేషించారు. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ విరాట్ కోహ్లీ లాగా సుదీర్ఘ కెరీర్ను నిర్మించడంపై దృష్టి పెట్టాలని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. "వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో 20 సంవత్సరాలు ఆడాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. విరాట్ కోహ్లీని చూడండి. విరాట్ 19 ఏళ్ల వయస్సులో ఆడడం ప్రారంభించాడు. ఇప్పుడు కోహ్లీ 18 సీజన్లు ఆడాడు. వైభవ్ దీన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. కానీ అతను ఈ ఐపీఎల్తో సంతోషంగా ఉండి ఇప్పుడు తాను కోటీశ్వరుడిని అని అనుకుంటే.. బహుశా మనం అతడిని వచ్చే ఏడాది చూడకపోవచ్చు. మొత్తానికి అతని అరంగేట్రం చాలా బాగుంది. మొదటి బంతికే సిక్స్ కొట్టాడు." అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

హెచ్చరించిన సెహ్వాగ్
ఓపిక పట్టాలని వైభవ్ సూర్యవంశీని సెహ్వాగ్ హెచ్చరించాడు. వైభవ్ బాగా రాణించడంపై దృష్టి పెట్టాలన్నారు. క్రికెట్ విషయానికి వస్తే బాగా ఆడినప్పుడు ప్రశంసలు వస్తాయని.. పేలవంగా ఆడినప్పుడు విమర్శలు తలెత్తుతాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. క్రికెటర్లు సమతుల్యంగా ఉండడానికి ఇదే మార్గం అన్నాడు. కొంత మంది క్రికెటర్లు ఐపీఎల్ సిరీస్లో 1 లేదా 2 మ్యాచ్లు ఆడిన తర్వాత అత్యున్నత కీర్తికి చేరుకుంటారని.. అప్పుడు వారు స్టార్ ప్లేయర్లు అయ్యారని భావించి ఏమీ చేయరు" అని సెహ్వాగ్ చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ కూడా తనను తాను స్టార్ గా భావించకూడదని.. క్రికెట్ పై దృష్టి పెట్టాలని చెప్పాడు.
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన ఇలా..
వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో కోటీశ్వరుడైన అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్కు లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అందులో వైభవ్ అద్భుతంగా రాణించాడు. వైభవ్ సూర్యవంశీ 170 స్ట్రైక్ రేట్ తో 34 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు.