హైదరాబాద్: 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' ప్రత్యేక షోకి తాను ఎందుకు హాజరు కాలేకపోయానో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి బయల్దేరడానికి ముందు క్రికెట్ లెజెండ్ సచిన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'ను బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ లో ఆటగాళ్ల కోసం ప్రత్యేక షో వేసిన సంగతి తెలిసిందే.

ఈ ప్రత్యేక షోకి సెహ్వాగ్ గైర్హాజరు కావడంపైనే అందరు చర్చించుకున్నారు. తనకు గురువు, దేవుడు అని సచిన్ను కీర్తించే సెహ్వాగ్ ఈ ప్రత్యేక షోకి ఎందుకు హాజరుకాలేదో ఓ వీడియో ద్వారా తెలిపాడు. 'వాస్తవానికి నాకు ఆహ్వానం అందింది. కానీ ఆ సమయంలో భార్యతో హాలీడే ట్రిప్ లో ఉన్నాను. దేవుడి(సచిన్) ప్రసాదాన్ని ఆస్వాదించకుండా భార్య ఆర్తీతో సమయం గడపాల్సి వచ్చిందని' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు డైరెక్టర్గా ఉన్న సెహ్వాగ్ రెండు నెలల పాటు విశ్రాంతి లేకుండా గడిపాడు. దీంతో ఇప్పుడు తన భార్య ఆర్తీతో కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో సచిన్ సినిమా ప్రీమియర్ షో వేయడంతో చూడలేకపోయాడు.