
హైదరాబాద్: విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాలుగా పేరు పొందారు. అయితే ఈ నలుగురిలో ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే కొందరేమో విరాట్ కోహ్లీ అని, మరికొందరేమో స్టీవ్ స్మిత్ అని చెబుతుంటారు.
అయితే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన ఓటుని కోహ్లీకే వేయడం విశేషం. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిని ఎంపిక చేసుకునే క్రమంలో తొమ్మిది మంది క్రికెటర్ల పేర్లను ఉదహరించిన సెహ్వాగ్.. చివరకూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తన మద్దతు తెలిపాడు.
సెహ్వాగ్ ఉదహరించిన పేర్లలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, జో రూట్, స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లాలు ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక అయిన ఫేస్బుక్లో అభిమానులతో చేసిన వీడియో చాట్లో వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్ అనడానికి మూడు ఫార్మాట్లలో కోహ్లీ నమోదు చేసిన యావరేజి గణంకాలను సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ 50.00పైగా నమోదు చేసిన సగటే అతన్ని అగ్రస్థానంలో నిలిపిందని అన్నాడు.
ఈ రేసులో కోహ్లీకి పోటీగా ఉన్న క్రికెటర్లతో పోలిస్తే అన్ని ఫార్మాట్లలో యాభైకిపైగా యావరేజి ఉన్న ఒక్క ఒక్క క్రికెటర్ కోహ్లీయేనని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇటీవలే శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా చెలరేగుతాడని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కోహ్లీసేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో తొలి టెస్టు మ్యాచ్ జనవరి 5న ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.