
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో దాదా పేరు ట్రెండింగ్లో ఉంది. ఇక రిటైర్మెంట్ అనంతరం నెట్టింట చురుగ్గా ఉంటున్న మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నాడు. సమయం, సందర్భాన్ని బట్టి తన ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. ఏ క్రమంలో దాదాకు శుభాకాంక్షలు చెప్పడం వైరల్గా మారింది.
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న RRR సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ని ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే బుల్లెట్పై ప్రయాణిస్తున్నట్లు ఉన్న ఆ పోస్టర్ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ని మార్ఫింగ్ చేసిన మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్.. ఎన్టీఆర్ ప్లేస్లో తనను, రామ చరణ్ స్థానంలో సౌరవ్ గంగూలీని ఉంచాడు. ఇక బైక్కి ముందు జాతీయ జెండాని అమర్చి.. నెంబర్ ప్లేట్కి 'దాదా' అని రాసుకొచ్ఛాడు . ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.
అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ మరో ట్వీట్ చేసి దాదాకు శుభాకాంక్షలు చెప్పాడు. 'సౌరవ్ గంగూలీకి ఉన్న అభిరుచిని, ఉద్దేశాలను కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. అలాంటి వారిలో నేను ఒకడిని. హ్యాపీ బర్త్డే దాదా' అని ట్వీట్ చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ కూడా తమదైన శైలిలో దాదాకు శుభాకాంక్షలు తెలిపాడు. 'గంగూలీ భాయ్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని.. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. రాబోయే రోజులు అంతా మంచే జరగాలి. హ్యాపీ బర్త్డే దాదా' అంటూ ట్వీట్ చేశాడు.
భారత్ తరఫున కెరీర్లో 113 టెస్టులాడిన 'ప్రిన్స్ ఆఫ్ కోల్కతా' సౌరవ్ గంగూలీ 16 శతకాలు, 35 అర్ధ శతకాల సాయంతో 7212 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్ 239. 311 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన గంగూలీ.. 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11363 పరుగులు సాధించారు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడు గంగూలీ. భారతీయుల్లో మూడో వ్యక్తి. మొత్తంగా 11363 పరుగులు చేశాడు. సచిన్ , కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు.