ఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియానే నేలకు దించి చరిత్ర తిరగరాసిన భారత క్రికెటర్లకు గురువారం సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముందుగా ముంబై చేరుకుని అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరీస్ గెలిపించిన కెప్టెన్ అజింక్య రహానే మాతుంగాలోని తన స్వగృహానికి చేరగానే.. హౌజింగ్ సొసైటీలోని స్థానికులంతా ఎర్రతివాచీ పరిచి మరీ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేయడమే కాకుండా అంచనాలను మించి రాణించిన తమిళనాడు పేసర్ టీ నటరాజన్కు తన సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది.
గురువారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న టీ నటరాజన్.. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తమిళనాడులోని సాలెం జిల్లా చిన్నప్పంపట్టి స్వగ్రామానికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడికి నీరాజనాలు పట్టారు. 'మన నట్టూ వచ్చాడంటూ' అభిమానులు సందడి చేశారు. పూలమాలలు, డప్పు వాయిధ్యాలతో స్వాగతం పలికారు. పల్లకీలా తయారు చేయించిన గుర్రపు బగ్గీలో ఊరేగించి విజయయాత్ర చేశారు. నటరాజన్ అక్కడి వారికి అభివాదం చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
టీ నటరాజన్కు దక్కిన ఆదరణ చూసిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో స్పందించాడు. నటరాజన్ ఊరేగింపు వీడియోను పోస్టు చేసి ఆనందం వ్యక్తం చేశాడు. 'భారత్ అంటే ఇది. ఇక్కడ క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువ. ఆసీస్ నుంచి వచ్చిన నటరాజన్కు చిన్నప్పంపట్టి గ్రామంలో ఘన స్వాగతం లభించింది. ఏమా అద్భుతం. నాకు చాలా సంతోషంగా ఉంది' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
నటరాజన్ మొదటగా ఐపీఎల్ 2020 కోసం ఆగస్టులో యూఏఈకి వెళ్లాడు. అక్కడ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్గా ఎంపికై అక్కడికి చేరుకున్నాడు. అయితే, అనూహ్యంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున ఇలా ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే అంచనాలకు మించి రాణించి విశేష ఆదరణ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్వగ్రామంలో అతడికి ఘన స్వాగతం లభించింది.
బ్యాట్స్మెన్కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్ కట్టర్లు, నెమ్మది బంతులతో టీ నటరాజన్ ఐపీఎల్ 2020లో ఆకట్టుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటన కోసం నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. ఇక వరుణ్ చక్రవర్తి గాయంతో నటరాజన్కు టీ20ల్లో అవకాశం దక్కింది. ఆ తర్వాత నవదీప్ సైనీ ఇంజ్యూరీతో వన్డేల్లో చోటు దొరికింది. ఉమేష్ గాయంతో టెస్టుల్లో కూడా చోటు దక్కింది. మొత్తానికి భారత బౌలర్ల గాయాలు నటరాజన్కు కలిసొచ్చాయనే చెప్పాలి.