దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ భారత్ క్రికెట్ లో హీరోలు. టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యక్తిగత రికార్డుల్లో సంచలనాలు నమోదు చేశారు. ఇద్దరూ విభిన్న శైలి గల బ్యాటర్లు. విధ్వంసానికి సెహ్వాగ్ మారు పేరు అయితే.. హేమాహేమీ బౌలర్లును కామ్ గా నిలువరించగలిగే ప్లేయర్ ద్రవిడ్.
అయితే ఇప్పుడు ఈ దిగ్గజ కుమారులు ఓ మ్యాచ్ లో పోటీపడ్డారు. బీసీసీఐ దేశవాళీ జూనియర్ టోర్నీ అయిన విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్ -16లో తలపడ్డారు. ద్రవిడ్ రెండో కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక తరపున, సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ దిల్లీ తరపున బరిలోకి దిగారు. మూడు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్ సోమవారం మొదలైంది.

జానియర్ ద్రవిడ్ కర్ణాటక జట్టుకు కెప్టెన్. అంతేగాక వికెట్ కీపర్ కూడా. ఇక జూనియర్ సెహ్వాగ్ దిల్లీ ఓపెనర్. అయితే తొలి రోజు ఆటలో అయిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అన్వయ్ ద్రవిడ్ డకౌటయ్యాడు. మరోవైపు ఆర్యవీర్ సెహ్వాగ్ హాఫ్ సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు.
తొలుత బ్యాటంగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్ లో 56.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన దిల్లీ మొదటిరోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ 98 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జూనియర్ సెహ్వాగ్ ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్ మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతోంది.