
ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 131పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5), మాథ్యూ వేడ్ (8) త్వరత్వరగా ఔటయ్యారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, శుభ్ మాన్ గిల్ మెల్లిగా ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. ఈ జోడీ మూడో వికెట్కు 63పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బౌలింగ్పై ఒత్తిడి పెరిగింది. ఇకపోతే హార్దిక్ 12వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో ఫోర్, సిక్సర్ బాది మ్యాచ్ మూమెంటమ్ ఛేంజ్ చేశాడు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.5కోట్లకు అశ్విన్ ను కొనుగోలు చేసింది. అయితే ఈ మ్యాచ్లో మాత్రం అశ్విన్ ఘోరంగా విఫలమయ్యాడు. తన రెగ్యులర్ ఆఫ్ స్పిన్కు బదులుగా క్యారమ్ బాల్స్ వేయడమే అతని కొంపముంచింది. ఇక కీలక దశలో బౌలింగ్ వేసిన అశ్విన్.. 3 ఓవర్లలో వికెట్లు పడకుండా 32పరుగులిచ్చాడు.
ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ ప్రదర్శన పట్ల భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. అశ్విన్ బౌలింగ్ విధానాన్ని తీవ్రంగా ప్రశ్నించాడు. అతను ఈ పిచ్ మీద ఆఫ్ స్పిన్ మాత్రమే వేస్తే బాగుండేదన్నాడు. ఎందుకంటే ఈ పిచ్ మీద స్పిన్ బానే పడుతుందని అంతకుముందు చాహల్ బౌలింగ్లో అర్థమైంది. బ్యాటర్లను స్పిన్ ఇబ్బంది పెట్టింది. అశ్విన్ మంచి ఆఫ్ స్పిన్ వేయగలిగినప్పుడు అనవసరంగా క్యారమ్ బాల్స్ ఉపయోగించి బ్యాటర్లు షాట్లు ఆడేలా చేశాడు అని సెహ్వాగ్ క్రిక్బజ్తో చెప్పాడు. ఆ మాత్రం ఐడియా కూడా అశ్విన్కు రాకపోవడం ఏంటోనన్నట్లు ప్రశ్నించాడు. శుభ్మాన్ గిల్ కు వేసినట్లే హార్దిక్ పాండ్యాకు బౌలింగ్ వేస్తే కుదరదని, అతను డిఫెన్స్ ఆడుతున్నంత మాత్రాన హిట్టింగ్ చేయలేడని భావించడం అశ్విన్ చేసిన పొరపాటని పేర్కొన్నాడు.
ఇకపోతే ఎక్స్ ట్రా బౌన్సీ పిచ్ మీద పేసర్లకు ఉపయుక్తమైన స్పెల్ వేయడానికి అవకాశమున్న తరుణంలో రియాన్ పరాగ్కు బదులుగా అదనపు పేసర్ను జట్టులో చేర్చుకోకుండా రాజస్థాన్ పెద్ద తప్పు చేసిందన్నాడు. ఇకపోతే టాస్ గెలిచిన తర్వాత సంజూ శాంసన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం సరికాదని, వారు క్వాలిఫయర్లో ఛేజింగ్లో ఎంత బాగా ఆడారో తెలిసి కూడా బ్యాటింగ్ ఎంచుకోవడం ఏంటో అర్థంకాలేదని సెహ్వాగ్ ప్రశ్నించారు.