హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడు మొదలవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తుంటే, ఎప్పుడు ఆడదామా అంటూ క్రీడాకారులు ఎదురుచూస్తున్నారు. అయితే వీరేందర్ సెహ్వాగ్కు ఈ ఐపీఎల్ విన్నర్ ఎవరో తెలిసిపోయిందంట. ఖచ్చితంగా వీరే గెలుస్తారంటూ సెహ్వాగ్ తేల్చి చెప్పేస్తున్నాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యజమాని అయిన వీరేందర్ సెహ్వాగ్ ఈ ఐపీఎల్ 11వ సీజన్కు విజేతలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లలోనే ఉండొచ్చని నొక్కి చెప్తున్నాడు. ఈ మూడింటిలోనే ఏదో ఒక జట్టు లీగ్ను గెలిచి తీరుతుందని పేర్కొన్నాడు.
ఏప్రిల్ 7 నుంచి మే 27వరకు జరగనున్న ఐపీఎల్కు మొదటి మ్యాచ్ ముంబైలోనే జరగనుంది. ఇధిలా ఉంటే ప్రేక్షకుల ఉత్కంఠను సొమ్ము చేసుకోవాలని ప్రసార మాధ్యమాలు ఉవ్విలూరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ టైమింగ్స్లోనూ మార్పులు చేయాలని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లాను అభ్యర్థించగా ఆయన ఆమోదించారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్ల సమయం మారిందంటూ జట్టు యాజమాన్యం సోమవారం ప్రకటన విడుదల చేసింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొహాలీలోనే నాలుగు మ్యాచ్లు ఆడనుంది. రెండు సంవత్సరాల నిషేదం తర్వాత ఐపీఎల్లో పాల్గొనబోతున్న రాజస్థాన్ రాయల్స్ ఎక్కడ ఆడేది అనే విషయం జనవరి 24న రాజస్థాన్ హైకోర్టు ఇచ్చే తీర్పుతో ముడిపడి ఉంది.
మొత్తం 1000కి పైగా ప్లేయర్లు ఐపీఎల్లో ఆడేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో కేవలం 573 మందినే బీసీసీఐ ఆమోదించగా వారిలో 360మంది భారతీయులు ఉన్నారు. జనవరి 27, 28 తేదీల్లో ఏ జట్టుకు ఎవరాడతారనే సస్పెన్స్ బెంగుళూరులో జరిగే వేలంలో తేలనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.