తొలి యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ చూసిన క్రికెట్ లోకం మొత్తం థ్రిల్ ఫీల్ అయింది. మాజీ దిగ్గజాలు కూడా దీనికి అతీతులేం కాదు. ఇంగ్లండ్పై ఆసీస్ ఉత్కంఠ భరిత విజయంపై మాజీ లెజెండ్స్ స్పందించారు. అందరూ కూడా ఆసీస్ ఆటతీరును తెగ మెచ్చుకున్నారు. అదే సమయంలో ఇంగ్లండ్ వ్యూహాలకు కొందరు మంచి మార్కులు వేశారు.
ఈ మ్యాచ్ అద్భుతంగా ఉందని, ఇటీవలి కాలంలో తను చూసిన బెస్ట్ మ్యాచ్ అని టీమిండియా లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. 'వాట్ ఎ టెస్ట్ మ్యాచ్. ఇటీవల నేను చూసిన బెస్ట్ మ్యాచుల్లో ఇది ఒకటి. అందుకే టెస్టు క్రికెట్ బెస్ట్ క్రికెట్ అనేది. మొదటి రోజు ముగియక ముందే డిక్లేర్ చేయడం నిజంగా ఇంగ్లండ్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ముఖ్యంగా వాతావరణాన్ని కూడా పరిగణిస్తే నిజంగా అది చాలా ధైర్యవంతమైన నిర్ణయం' అని మెచ్చుకున్నాడు.

అయితే ఆసీస్ జట్టు అద్భుతంగా ఆడిందని సెహ్వాగ్ అన్నాడు. 'ఉస్మాన్ ఖవాజా రెండు ఇన్నింగ్సుల్లో చెలరేగాడు. ఇక ప్యాట్ కమిన్స్.. టెస్టుల్లో కొత్త మిస్టర్ కూల్ అని చెప్పాలి. అంత ఒత్తిడిలో ఎంత అద్భుతంగా ఆడాడు? లియాన్తో అతని భాగస్వామ్యం చాలా కాలం గుర్తుండిపోతుంది' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ మ్యాచ్ను మెచ్చుకున్నాడు.
2005లో స్టార్లతో నిండిన ఆసీస్ జట్టును ఇంగ్లండ్ 2-1 తేడాతో ఓడించి యాషెస్ సిరీస్ నెగ్గింది. ఇప్పుడు జరుగుతున్న సిరీస్లో కూడా ఆ వైబ్స్ ఉన్నాయని అశ్విన్ అన్నాడు. సౌతాఫ్రికా మాజీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా ఈ టెస్టు మ్యాచ్ ఆసాంతం ట్విట్టర్లో యాక్టివ్గానే ఉన్నాడు. ఎప్పటికప్పుడు మ్యాచ్ గురించి ట్వీట్స్ చేస్తూ, తన అభిప్రాయాలు చెప్పాడు.
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్లకు శుభాకాంక్షలు తెలిపాడీ సఫారీ దిగ్గజం. ఇదొక ఫెంటాస్టిక్ గేమ్ అని మెచ్చుకున్నాడు. అంతకుముందు ఆసీస్ పట్టుదలను కొనియాడిన అతను.. 'రన్ రేట్ అసలు సమస్యే లేదు. ఆసీస్ ఇంటెంట్లో కూడా లోపం లేదు. పరుగులు చేయడం కష్టంగా ఉన్న వికెట్పై కష్టపడాలని వాళ్లు నిర్ణయించుకున్నారంతే' అని చెప్పాడు.
ఇక మ్యాచ్ ముగియగానే.. 'వావ్.. ఎంత గొప్ప మ్యాచ్. రన్ రేట్ బాగానే ఉందా?' అంటూ రన్ రేట్పై విమర్శలు చేసిన వారికి చురకలంటించాడు. చివర్లో రెండు జట్లు అద్భుతంగా ఆడాయని మెచ్చుకున్నాడు. 'రెండు టీమ్స్ గొప్పగా ఆడాయి. టెస్ట్ క్రికెట్ తన బెస్ట్ ఫామ్లో కనిపించింది' అని డివిలియర్స్ ట్వీట్ చేశాడు.