హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, బ్రిటిష్ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్ల మధ్య ట్విట్టర్ వార్ మళ్లీ మొదలైంది. రియో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణం అందించిన పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిపించిన భారత అభిమానులను అప్పట్లో పీర్స్ మోర్గాన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
దీంతో క్రికెట్ కనిపెట్టిన మీరు(ఇంగ్లండ్ మెన్స్ జట్టు) ఇంత వరకు ఒక వరల్డ్కప్ సాధించకపోవడం సిగ్గు చేటు అని అప్పట్లో మన మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ స్ట్రాంగ్ సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లార్డ్స్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఈ ఓటమిపై పీర్స్ మోర్గాన్ తన ట్విట్టర్లో 'మహిళల వన్డే ప్రపంచకప్ను ఇంగ్లాండ్ గెలిచింది. ఓకేనా సెహ్వాగ్?' అని ప్రశ్నించాడు. దీనికి సెహ్వాగ్ కూడా గట్టిగానే స్పందించాడు. 'ఈ ఓటమిని కూడ మేం గర్విస్తున్నాము.. దీంతో మా జట్టు మరింత ధృడంగా తయారైందని' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
'భారత్ ఒలింపిక్స్లో మరో బంగారు పతకం సాధించేలోగా ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలుస్తోంది. మిలియన్ రూపాయలు పందెం' అని అప్పట్లో మోర్గాన్ పేర్కొన్నాడు. మిలియన్ రూపాయలను చెల్లించాలని మోర్గాన్ ఈ సందర్భంగా పాత విషయాలను గుర్తు చేస్తూ మన ఛాలెంజ్ గుర్తుందా? అని మరో ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్తో జరిగిన ఫైనల్లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాట్స్ ఉమెన్లలో ఓపెనర్ పూనమ్ రౌత్(86) టాప్ స్కోరర్గా నిలిచింది.
స్మృతి మిథాలీ రాజ్ 17, హర్మన్ ప్రీత్ కౌర్ 51, రౌత్ 86, వేద కృష్ణమూర్తి 35, పాండే 4, దీప్తీ శర్మ 14 పరుగులు చేయగా మందాన, స్మృతీ వర్మ, గైక్వాడ్ డకౌట్గా వెనుదిరిగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ష్రుబ్షోలే 4/45తో భారత వికెట్ల పతనంలో కీలక పాత్ర పోషించింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్లలో స్కీవర్ (51) టాప్ స్కోరర్గా నిలవగా టేలర్(45) రాణించింది. ఇంగ్లాండ్కిది నాలుగో వరల్డ్కప్ కావడం విశేషం.