
హైదరాబాద్: అసలే ఇవాళ ఏప్రిల్ 1, అదీగాక, వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్లలోనే వైవిధ్యం చోటు చేసుకుని ఉంటుంది. అలాంటిది అన్నీ తానై నడిపిస్తోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విషయంలో కూడా తన పాత్ర ముమ్మాటికీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
ఆ ట్వీట్లో సెహ్వాగ్ మళ్లీ ఐపీఎల్లో పంజాబ్ జట్టు తరపున ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడని ఉంది. ఇదిలా ఉంచితే ఆ ట్వీట్ కింద యువరాజ్ సింగ్ ట్వీట్ చేస్తూ.. సెహ్వాగ్ నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను మళ్లీ ఆడితే చూడాలని ఉంది అంటూ యువీ ట్వీట్ చేశాడు.
ఇదే నిజమైతే.. వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఏప్రిల్ 8న మొహాలీ వేదికగా ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో పంజాబ్ తరఫున ఓపెనింగ్ చేయనున్నాడు. వివాహం కారణంగా జట్టుకు దూరమైన ఓపెనర్ అరోన్ ఫించ్ స్థానంలో సెహ్వాగ్ బరిలోకి దిగుతున్నాడట. ఇది కింగ్స్ పంజాబ్ తాజాగా చేసిన ట్వీట్.
ఇటీవల జరిగిన ఐస్ క్రికెట్ మ్యాచ్ల్లో వీరూ సత్తా చాటాడు. పంజాబ్ ఆటగాళ్లతో కలిసి నెట్ ప్రాక్టీసులోనూ పాల్గొంటున్నాడు. మొదట్లో బౌలర్లకు కాస్త ప్రాక్టీస్ ఇవ్వడానికి నెట్స్లోకి దిగినా.. ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. దీంతో కెప్టెన్ అశ్విన్, కోచ్ బ్రాడ్ హాడ్జ్, సెహ్వాగ్లతోపాటు టీమ్ మేనేజ్మెంట్ అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని కింగ్స్ ఎలెవన్ తెలిపింది.
మొదట్లో ఈ వ్యవహారాన్ని జోక్గా తీసుకున్నప్పటికీ.. తర్వాత సీరియస్గా తీసుకున్నట్లు వీరూ చెప్పాడు. చూస్తుంటే.. ఢిల్లీ జట్టుకు గంభీర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఒకప్పుడు ఓపెనర్లుగా బరిలో దిగిన వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడనున్నారు.