దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఐపీఎల్ తుది దశకు చేరింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చాలామంది కుర్రాళ్లు, సీనియర్లు అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. వెటరన్ విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ తదితరులు సూపర్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అయితే ఈ సీజన్లో తన దృష్టిలో టాప్-5 పెర్ఫామర్లను సెహ్వాగ్ ఎంచుకున్నాడు.
అయితే ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇద్దరినీ సెహ్వాగ్ సెలెక్ట్ చేయలేదు. దీనికి కారణం కూడా చెప్పాడీ లెజెండ్. 'నేను నా ఐదుగురు పాండవుల్లో ఎక్కువ మంది ఓపెనర్లను సెలెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే వారికి మరీ ఎక్కువ అవకాశాలు దక్కుతాయి కదా. ఇక అసలు లిస్టులోకి వస్తే.. నా ఫస్ట్ బ్యాటర్ రింకూ సింగ్. అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశానో ఎవరూ కారణం కూడా అడగరు అని అనుకుంటున్నా' అని సెహ్వాగ్ చెప్పాడు.

'ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది తమ టీంను గెలిపించలేదు. అందుకే రింకూను సెలెక్ట్ చేశా. ఇక రెండో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబే. అతను 160 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 33 సిక్సర్లు బాదాడు. గత సీజన్లలో పెద్దగా ఆకట్టుకోని అతను ఈ సీజన్లో చాలా క్లారిటీగా ఆడాడు. క్రీజులోకి వస్తే సిక్సర్లు బాదాలనే ఇంటెంట్తో ఆడాడు' అని సెహ్వాగ్ వివరించాడు.
'ఇక మూడో ప్లేయర్ అద్భుతమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్. సూపర్ బ్యాటింగ్ వల్ల అతన్ని తప్పకుండా సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చే బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. స్కై పేరు ఎందుకు చెప్తున్నాను అంటే.. అతను అంత గొప్ప ఫామ్లో లేడు. ఈ ఐపీఎల్లో కూడా ఆరంభంలో కొంత కష్టపడ్డాడు. కానీ ఆ తర్వాత బాగానే రాణించాడు' అని చెప్పాడు.

'ఇక చివరగా కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్. స్పిన్, పేస్ బౌలింగ్ను అంత గొప్పగా ఎదుర్కొనే ట్యాలెంట్ మరే ఇతర విదేశీ ప్లేయర్లో నాకు కనిపించలేదు' అని వివరించాడు. సెహ్వాగ్ సెలెక్ట్ చేసిన ఐదుగురిలో ముగ్గురు బ్యాటర్లు ఈ ఐపీఎల్లో సెంచరీలు బాదిన వాళ్లే ఉండటం గమనార్హం. మంచి ఫామ్లో కనిపించిన విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇద్దర్నీ సెహ్వాగ్ సెలెక్ట్ చేయకపోవడం గమనార్హం.