
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ లెర్నింగ్ వెబ్సైట్ 'CRICURU'ని ప్రారంభించాడు. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్తో కలిసి వీరూ ఈ వెబ్సైట్ని బుధవారం లాంచ్ చేశాడు. క్రికెట్ కోచింగ్కు సంబంధించి భారత్లో ఇదే మొట్టమొదటి వెబ్సైట్ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ వెబ్సైట్ ద్వారా దేశ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు వ్యక్తిగతంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ భారత్ తరఫున 104 టెస్ట్లు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు.
'CRICURU' సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొత్త టెక్నాలజీతో పాటు భారత క్రికెటర్లకి శిక్షణ ఇచ్చే స్థాయిలో కోచింగ్ ఇవ్వనున్నట్లు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. తనతో పాటు సంజయ్ బంగర్ కూడా యూజర్లకి పర్సనల్గా కోచింగ్ ఇస్తాడని వెల్లడించాడు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోచింగ్ ఎక్స్ఫర్ట్లతో తమ యూజర్లకు శిక్షణ ఇప్పిస్తామని, తామిచ్చే కోచింగ్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుందని వివరించాడు. వీరూ లెర్నింగ్ వెబ్సైట్ ద్వారా యువకులు లాభపడనున్నారని మాజీలు అంటున్నారు.
'CRICURU వెబ్సైట్ ద్వారా యువ క్రికెటర్లకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోచింగ్ ఎక్స్ఫర్ట్స్ శిక్షణ ఇవ్వనున్నాం. ఈ కోచింగ్ ఇంటర్నేషనల్ క్రికెటర్ల స్థాయిలో ఉంటుంది. ఇది ఇప్పుడిప్పుడే క్రికెట్ నేర్చుకుంటున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. అంతేకాదు యువ క్రికెటర్ల తల్లిదండ్రుల్ని కూడా కోచింగ్లో భాగస్వామ్యుల్ని చేస్తాం. దాంతో పేరెంట్స్ క్రికెటర్లకి పార్టనర్గా మారతారు. ఇది క్రికెటర్లని ప్రొఫెషనల్ ఆటగాళ్లగా మార్చేందుకు ఉపయోగపడుతుంది' అని వెబ్సైట్ ఫౌండర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.
CRICURU కో ఫౌండర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ... 'CRICURU లాంచ్ చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రికెటర్లకి కూడా కోచింగ్ అందించడమే. ఇంట్లో కూర్చోనే సౌకర్యంగా కోచింగ్ తీసుకోవచ్చు. కేవలం స్మార్ట్ఫోన్, ఇంటర్నేట్ కనెక్షన్ ఉంటే చాలు. వెబ్సైట్లో కోచింగ్తో పాటు దిగ్గజ క్రికెటర్ల ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. మాతో భాగస్వాములు కావాలనుకున్న ఔత్సాహికులు www.cricuru.comకి వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ ఫీజు రూ.299 నుంచి ప్రారంభమవుతుంది' అని చెప్పారు.