
హైదరాబాద్: భవిష్యత్తులో ఇస్రో అన్ని అవరోధాలను అధిగమించి విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ్ ల్యాండర్ పయనం.. జాబిల్లిపై అడుగుపెట్టే చివరి క్షణంలో సాంకేతిక లోపం తలెత్తి సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలువురు క్రీడాకారులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచారు. టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ తన ట్విట్టర్లో "'చంద్రయాన్ -2 ప్రయోగ కల ఫలించకున్నా, ఆ కలను నిజం చేయాలనే పట్టుదల, విశ్వాసం, నమ్మకం ఇస్రో శాస్త్రవేత్తలకు సజీవంగానే ఉంది. భవిష్యత్తులో ఇస్రో అన్ని అవరోధాలను అధిగమించి విజయం సాధిస్తుంది" అని ట్వీట్ చేశాడు.
ప్రముఖ రెజ్లర్ గీతాఫొగట్ తన ట్విట్టర్లో "పడవ అలలకు భయపడి సముద్రం దాట లేదు, కాని మళ్లీ నిరంతరాయంగా ప్రయత్నించే వారు ఓడిపోరు. ఇస్రో చంద్రయాన్-2 బృందాన్ని చూసి భారతదేశం మొత్తం గర్విస్తోంది" అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రయాన్-2 ప్రయోగాన్ని బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి ప్రధాని మోడీ ప్రత్యక్షంగా వీక్షించారు.
చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ్ ల్యాండర్ పయనం.. ఆ తర్వాత కుదుపునకు లోనవ్వడంతో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. రూ. వెయ్యికోట్లు విలువైన చంద్రయాన్-2 ప్రాజెక్టు చివరి క్షణంలో చేదు ఫలితాన్ని ఇవ్వడంతో ఇస్రో ఛైర్మన్ శివన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
ప్రయోగం అనంతరం ప్రధాని మోడీని కలిసిన సమయంలో భావోద్వేగం తట్టుకోలేక చిన్నపిల్లాడిలా కన్నీటి పర్యంతమయ్యారు. శివన్ పరిస్థితిని గమనించిన ప్రధాని మోడీ ఆయనను గుండెలకు హత్తుకుని ఓదార్చడంతో పాటు వెన్నుతట్టి ధైర్యం నింపారు. శాస్త్రవేత్తల అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని, భవిష్యత్తులో విజయాలు సాధిస్తారంటూ మోడీ ధైర్యం నింపారు.