
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్లో చాలా మంది భారత వికెట్ కీపర్లు సత్తా చాటుతున్నారు. ఇక టీమిండియాకు మొదటి ఛాయిస్ అయిన రిషబ్ పంత్.. వికెట్ కీపర్గా, కెప్టెన్గా ఢిల్లీ క్యాపిటల్స్కు కీలక ప్లేయర్గా ఉన్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లోనూ పంత్ రాణిస్తుండడం మంచి పరిణామం. ఇక అనుభవజ్ఞుడైన టీమిండియా బ్యాటర్ వృద్ధిమాన్ సాహా కూడా గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్గా గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నాడు.
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అలాగే ముంబై ఇండియన్స్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా బ్యాట్తో ఆకట్టుకున్నాడు. సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్లో కీలక ప్లేయర్గా, కీపర్గా, కెప్టెన్గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియాకు ఎంపిక చేయాల్సిన మరో వికెట్ కీపర్ గురించి ప్రస్తావించాడు. పైన పేర్కొన్నవారు కాకుండా మరో వికెట్ కీపర్ తనను ఆకట్టుకుంటున్నాడని చెప్పాడు. ఈ ఏడాది అక్టోబరు, నవంబర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో బ్యాకప్ వికెట్ కీపింగ్ ఎంపికగా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన ప్లేయర్గా అన్క్యాప్డ్ ఇండియన్ వికెట్ కీపర్-బ్యాటర్ జితేష్ శర్మను పేర్కొన్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్తో శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ఈ పంజాబ్ ప్లేయర్ కేవలం 17బంతుల్లో 37పరుగులతో చెలరేగి ఆడాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 20ఓవర్లలో 189పరుగుల టఫ్ స్కోరు చేయగలిగింది. ఈ స్కోరును రాజస్థాన్ రాయల్స్ ఛేదించిన సంగతి తెలిసిందే.
'నో డౌట్. అద్భుతమైన బ్యాటింగ్తో జితేష్ శర్మ ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా అందరూ వికెట్ కీపర్-బ్యాటర్లే, కానీ అందరికంటే జితేష్ శర్మ నన్ను బాగా ఆకట్టుకున్నాడు. అతను భయం లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని బ్యాటింగ్ స్కిల్ నాకో విషయాన్ని గుర్తుచేసింది. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ను భారత బ్యాటింగ్ గ్రేట్ వీవీఎస్ లక్ష్మణ్ ఎలా ఎదుర్కొన్నాడో అలాగా చాహల్ను జితేష్ ఎదుర్కొన్నాడు.
అతనికి తన జోన్లు తెలుసు. అతను ఎలాంటి షాట్లు ఆడాలో కూడా అంచనా వేసుకుంటాడు. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో కొట్టిన సిక్స్.. షేన్ వార్న్ బౌలింగ్లో మిడ్ వికెట్ ద్వారా వీవీఎస్ లక్ష్మణ్ కొట్టిన సిక్స్లా అనిపించింది. టీ20ప్రపంచకప్ సెలెక్షన్ నా చేతిలోనే ఉండుంటే నేను అతనిని బ్యాకప్ వికెట్ కీపర్-బ్యాటర్గా ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కిస్తాను' అని సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.