న్యూఢిల్లీ: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కొడుకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన రికార్డును బ్రేక్ చేస్తే ఫెరారీ కారు బహుమతిగా ఇస్తానని వారికి చెప్పాడు. టెస్టుల్లో తన పేరిట ఉన్న 319 పరుగుల రికార్డును బద్దలు కొడితే బహుమతి ఇస్తానని చెప్పాడు.
వీరేంద్ర సెహ్వాగ్ అక్టోబర్ నెలలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. గురువారం నాడు బిసిసిఐ అతనిని సత్కరించింది. సెహ్వాగ్ సొంత మైదానమైన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అతనిని సత్కరించింది. భారత్ - దక్షిణాఫ్రికా నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు సత్కారం జరిగింది.

ఈ సందర్భంగా భారత్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సెహ్వాగ్ను ప్రశంసల్లో ముంచెత్తారు. తనకు మద్దతిచ్చిన వారందరికీ సెహ్వాగ్ కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం అతను మాట్లాడాడు.
తన కొడుకులు ఆర్యవీర్, వేదాంత్ (తండ్రి వెంటే ఉన్నారు) ఎవరైనా తన 319 పరుగుల రికార్డును బద్దలు కొడితే ఫెరారీ బహుమతిగా ఇస్తానని చెప్పాడు.
సెహ్వాగ్ 2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేశాడు. భారత్ తరఫున టెస్టుల్లో తొలి మూడు అత్యధిక పరుగుల రికార్డ్ సెహ్వాగ్ పేరిటే ఉంది. 319, 309, 293 పరుగులు వరుసగా ఉన్నాయి. భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు సెహ్వాగే.