
ఢాకా: క్షణికావేశంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర దూమారం రేపుతోంది. ఢాకా వేదికగా జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2021లోమహ్మదాన్ స్పోర్టింగ్ టీమ్కి కెప్టెన్గా ఉన్న షకీబుల్.. అబహాని లిమిటెడ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సహనం కోల్పోయి ఫీల్డ్ అంపైర్పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు.ఈ క్రమంలో మొదటగా ఫస్ట్ స్టంప్లను కాలితో తన్నిన షకీబుల్.. ఆ తర్వాత ఓవర్లో వికెట్లని మొత్తం పీకేసి విసిరికొట్టాడు. దాంతో ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా అయ్యాయి.
శుక్రవారం ఢాకా ప్రీమియర్ లీగ్లో భాగంగా మొహమ్మదాన్, అబహాని జట్ల మధ్య జరిగింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ను షకీబుల్ హసన్ వేయగా.. ముష్ఫికర్ రహీమ్ వరుసగా 6, 4 బాదేశాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన షకీబుల్.. అదే ఓవర్లో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. బంతి ముష్ఫికర్ బ్యాట్కి తాకలేదు. ఇక వికెట్లకి దూరంగా వెళ్తున్నట్లు బంతి కనిపించడంతో ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్ని తిరస్కరించాడు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షకీబుల్.. వికెట్లని గట్టిగా కాలితో తన్నాడు. అంతటితో ఊరుకోకుండా అంపైర్తో గొడవకు దిగాడు.
ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వర్షం మొదలవడంతో.. ఆ ఓవర్లో ఒక బంతి మిగిలి ఉండగానే అంపైర్లు ఆటని నిలిపివేశారు. దాంతో మరోసారి షకీబుల్ హసన్ సహనం కోల్పోయి హద్దులు దాటాడు. తన ఫీల్డింగ్ స్థానం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన షకీబుల్ మూడు స్టంప్స్ను ఊడబీకి కిందకు విసిరికొట్టాడు. ఆట ఆపేంత వర్షం రావడం లేదు కదా అని అసహనం ప్రదర్శించిన అతను ఆ తర్వాత కింద నుంచి స్టంప్స్ను తీసుకొని మళ్లీ అంపైర్ కాళ్ల దగ్గర పడేశాడు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితం తేలాలంటే కనీసం 6 ఓవర్లు పూర్తి కావాల్సి ఉన్నందున.. ఆ ఆఖరి బంతిని వేయించాలని అతడు డిమాండ్ చేశాడు. కానీ అంపైర్లు తిరస్కరించడంతో కోపంతో ఊగిపోయాడు.
షకీబుల్ హసన్ తీరుని మాజీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో 212 వన్డేలు, 76 టీ20లు, 57 టెస్టులాడిన షకీబుల్ ఓ గల్లీ క్రికెటర్లా వ్యవహరించాడని మండిపడుతున్నారు. ఇలాంటి క్రికెటర్లు మనకు అవసరమా? అంటూ ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ లిసా స్టాలేకర్ ప్రశ్నించారు. గతంలోనూ ఆ దేశ క్రికెటర్లు మైదానంలో హద్దులు దాటిని తీరుని ఆమె గుర్తుచేశారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గతంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా.. షకీబుల్ హసన్ చెవి పట్టుకుని మెలిపెడుతున్న ఫొటోని తాజాగా షేర్ చేశాడు. అతడికి అదే సరైన శిక్ష అన్నట్టు వీరూ పేర్కొన్నాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.