న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి క్రికెటర్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. గతంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయని... ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే.
దీనిపై వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ తదితరులు స్పందించారు. జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవకతవకలు జరిగాయనే ఆరోపణలను ఖండించారు. డిడిసీఏకు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆటగాళ్లకు ఆయన అండగా నిలిచేవారే తప్ప ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదన్నారు.
కొన్ని సందర్భాల్లో ఢిల్లీ క్రికెట్లో ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి ఏమైనా చెప్పవలసి ఉంటే నేరుగా ఆయన వద్దకు వెళ్లి చెప్పేవాళ్లమని సెహ్వాగ్ అన్నారు. జైట్లీని అసందర్భంగా తప్పుబడుతున్నారని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు. ఆయన హయాంలోనే ఢిల్లీ స్టేడియానికి ట్యాక్స్ మినహాయింపు లభించిందన్నారు.

ఓ గుర్తింపు కూడా వచ్చిందన్నారు. ఢిల్లీ ఆటగాళ్లకు ఏ సాయం కావాల్సి వచ్చినా ఆయన ముందుండేవారని ఇషాంత్ శర్మ అన్నారు. ఆయనతో తాను ఎప్పుడు కలిసినా న్యాయపరంగా ఉండటమే కాకుండా ఆటగాళ్ల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా వ్యవహరించేవారన్నారు.
కాగా, డిడిసిఏ అధ్యక్షుడిగా జైట్లీ పదమూడేళ్ల పాటు ఉన్నారు. ఈ సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ సర్కార్ ఆరోపించింది. ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు.