హైదరాబాద్: ఫ్యాన్స్ ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓవర్ల సంఖ్యను కుదిస్తూ వచ్చారు. తొలుత 50 ఓవర్ల క్రికెట్ను పూర్తిగా ఆస్వాదించిన సగటు క్రికెట్ అభిమాని ఇప్పుడు టీ20 క్రికెట్కు అలవాటు పడ్డాడు.
టీ20 క్రికెట్ అభిమానులను ఎంత ఉర్రూతలూగిస్తోందో అందరికీ తెలిసిందే. దీంతో 50 ఓవర్ల వన్డే క్రికెట్కు ఆదరణ తగ్గింది. ఇప్పుడు 20 ఓవర్ల క్రికెట్ కంటే మరింత పొట్టి ఫార్మాట్ వీక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అదే టీ10 క్రికెట్. యూఏఈ వేదికగా డిసెంబరు 21 నుంచి 24 మధ్య టీ10 లీగ్ జరగనుంది.

యూఏఈలోని షార్జా క్రికెట్ మైదానంలో మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఈ లీగ్లో పాల్గొనేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి బ్యాట్ పట్టనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, షాహిద్ అఫ్రిది, క్రిస్గేల్, కుమార సంగక్కర తదితరులు ఈ టోర్నీలో ఆడేందుకు అంగీకరించారు.
పంజాబీస్, మరాఠాస్, బంగ్లాస్, లంకన్స్, సింధీస్, కేరళిటీస్, పఖ్తూన్స్గా జట్ల పేర్లను ప్రకటించారు. దాదాపు 20 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఈ టీ10 లీగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మ్యాచ్ నిర్వహణకు సుమారు 90నిమిషాల సమయం కేటాయిస్తామని నిర్వాహకులు తెలిపారు.