Virender Sehwag: ఐపీఎల్ 2025లో వరుసగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేశాడు. ధోని , చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎంత గొప్ప ఆటగాడైనప్పటికీ చివరి రెండు ఓవర్లలో ఒక పని చేయలేకపోయాడని విమర్శించాడు. గత ఐదేళ్లలో సీఎస్కే 180 పరుగుల ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని సెహ్వాగ్ అన్నారు.
ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో 39 పరుగులు చేస్తే సీఎస్కే గెలవగలిగే పరిస్థితి ఉండేది. క్రీజులో ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఉన్నారు. ధోని సిక్సర్లు బాది విజయం సాధిస్తాడని అభిమానులు ఆశించారు. 19వ ఓవర్లో సీఎస్కే 19 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 20 పరుగులు చేస్తే సీఎస్కే గెలుస్తుంది. కానీ చివరి ఓవర్ తొలి బంతికే ధోనీ ఔటయ్యాడు. చివరి ఓవర్లో సీఎస్కే కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగులతో తేడాతో ఓడిపోయింది.

దీని గురించి వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.." ధోని ఇంతకు ముందు ఎన్నిసార్లు ఒక ఓవర్ లో 20 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. రెండు ఓవర్లలో 40 పరుగులు చేయడం చాలా కష్టమైన పని. క్రీజులో ఎంతటి పెద్ద ప్లేయర్ ఉన్నా అది చేయడం అలా కష్టం. ఏదో ఒకటి రెండు సందర్భాల్లోనే ఇలాంటివి జరుగుతాయి. ధోని ఒకప్పుడు అక్షర్ పటేల్ బౌలింగ్ లో 24 నుంచి 25 పరుగులు చేసినట్లు గుర్తు. మరొకసారి ధర్మశాలలో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో 19 లేదా 20 పరుగులు చేశాడు. అలాంటివి ఒకటి లేదా రెండు మ్యాచ్ లు మాత్రమే మనకు గుర్తుంటాయి. ఇటీవల అలాంటివేమీ జరిగినట్లునాకు గుర్తు లేదు. గత ఐదేళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ 180 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది" అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యఛేదనలో తడబడుతున్నట్లు కనిపిస్తోంది. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 160 పరుగుల్లోపే ఉన్న టార్గెట్ ను చివరి ఓవర్ వరకూ తీసుకెళ్లింది. ఆర్సీబీతో 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తాజాగా రాజస్థాన్ జట్టుపై 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.