న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన సంచలన ట్వీట్పై స్పష్టతనిచ్చాడు. 'రెండు ట్రిపుల్ సెంచరీలను నేను చేయలేదు. నా బ్యాటు చేసింది' అంటూ సెహ్వాగ్ పెట్టిన ట్వీటు తీవ్ర చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. తన ట్వీటు గుర్ మెహర్ను ఉద్దేసించినది కాదని స్పష్టం చేశాడు. ఆ ట్వీట్ కేవలం వినోదం కోసమేనని, కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని 'ఇండియా టుడే' పత్రికకు తెలిపాడు. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని స్పష్టం చేశాడు.
ఎవరికైనా తమ అభిప్రాయాన్ని తెలిపే హక్కు ఉంటుందని సెహ్వాట్ మరో ట్వీట్ చేశాడు. సదరు యువతి(గుర్మెహర్ కౌర్)కి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కుందని, ఆమెను కొందరు బెదిరింపులకు గురిచేయడం సరైన పని కాదని చెప్పాడు.
కాగా, కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ మన్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్ కౌర్.. 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు. యుద్ధమే చంపింది' అని ట్వీట్ చేసిన నేపథ్యంలో, సెహ్వాగ్ ట్వీట్ కొంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
సెహ్వాట్ ట్వీట్కు అనేక మంది నుంచి మద్దతు లభించినప్పటికీ.. మరికొందరు విమర్శించడం గమనార్హం. తాను ఎంతగానో అభిమానించే సెహ్వాగ్ ఇలా ట్వీట్ చేయడంతో తన గుండె బద్దలైందని గుర్మెహర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ క్రమంలో తన ట్వీట్పై సెహ్వాగ్ స్పష్టతనివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.