హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైనప్పటికీ తిరిగి అనుహ్యంగా పుంజుకొని 2-1తో సిరీస్ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఆసీస్ టెస్టు సిరిస్ను గెలిచిన నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్టర్లో స్పందించాడు. 'చివరికి హోమ్ సీజన్ ముగిసింది. ఇక # వీరూఘరేలుఅవార్డ్స్కు సమయం ఆసన్నమైంది.
* పుజారా - ఇన్వర్టర్
* జడేజా - తుల్లు పంప్
* కేఎల్ రాహుల్ - స్టెబిలేజర్
* స్మిత్ - ట్యూబ్లైట్'
అంటూ వీరూ ట్వీట్ చేశాడు.
ఆసీస్తో ముగిసిన టెస్టు సిరిస్లో రాణించిన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఏడు ఇన్నింగ్స్లాడి 65.50 యావరేజితో 393 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సిరిస్లో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడడంతో స్టెబిలేజర్ అవార్డ్కు ఎంపిక చేశాడు.
ఇక ఛతేశ్వర్ పుజారా ఒక డబుల్ సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలతో 405 పరుగులు చేశాడు. విద్యుత్ లేనప్పుడు ఇన్వర్టర్ అక్కరకొచ్చినట్లు పుజారా అవసరంలో ఆదుకొన్నాడని ట్వీట్ చేశాడు.