ICC Hall of Fame: టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో అతన్ని చేరుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. దీంతో ఈ ఘనత సాధించిన ఏడో భారతీయ క్రికెటర్గా సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. వీరూతోపాటు శ్రీలంక ప్లేయర్ అరవింద డి సిల్వ, భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీని కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో చేర్చడం గమనార్హం.
టెస్టులైనా, వన్డేలైనా తనకంటూ ఉన్న ప్రత్యేకమైన శైలితో ఆడిన సెహ్వాగ్.. ఫియర్లెస్ అప్రోచ్తో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో 8 వేలపైగా పరుగులతో కెరీర్ ముగించాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుతోపాటు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సెహ్వాగ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఈ అరుదైన గౌరవం లభించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశాడు.

'నాకు ఈ గొప్ప గౌరవం ఇచ్చినందుకు ఐసీసీ, జ్యూరీకి కృతజ్ఞతలు. నా జీవితంలో చాలా భాగం నాకు ఎంతో ఇష్టమైన పని చేస్తూ గడిపినందుకు సంతోషంగా ఉన్నా. అదే క్రికెట్ బాల్ను బాదడం. ఈ గౌరవం దక్కిన సందర్భంగా నా కుటుంబ సభ్యులకు, నాతో కలిసి ఆడిన వారికి, నా కోసం నిస్వార్థంగా ప్రార్థించిన ఎంతో మందికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా' అని సెహ్వాగ్ చెప్పాడు.
ఇక భారత్ నుంచి 'ఐసీసీ హాల్ ఆఫ్ ఫేం'లో చోటు సంపాదించిన తొలి మహిళా క్రికెటర్గా డయానా ఎడుల్జీ నిలిచింది. స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఆమె తన కెరీర్లో 20 టెస్టులు, 34 వన్డేలు ఆడింది. వీటిలో వందకుపైగా వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. గతంలోనే అర్జున అవార్డు (1983), పద్మశ్రీ (2002) అవార్డులు అందుకున్న ఆమె.. ఇప్పుడు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో కూడా చేరింది. ఇక ఈ గౌరవం దక్కిన నాలుగో శ్రీలంక ప్లేయర్గా అరవింద డి సిల్వ కూడా రికార్డు నెలకొల్పాడు.