

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ .. కాస్త విరామం దొరికితే చాలు.. ఇంట్లో సభ్యులతో చక్కర్లు కొట్టేస్తుంటాడు. పార్టీలకీ, ఫంక్షన్లకీ సాధ్యమైనంత వరకూ సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ పూర్తయ్యాక దొరికిన విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు కెప్టెన్. కోహ్లీ ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీ క్రికెట్ ఆడాలనుకున్న ఆశలకు గాయం కారణంగా గండి పడినట్లైంది.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన చివరి మ్యాచ్లో కోహ్లీ మెడకు గాయమైంది. బీసీసీఐ వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో వారి ఆధ్వర్యంలోనే కోహ్లీ శిక్షణ పొందుతున్నాడు. ముంబైలోని ఓ ఇండోర్ స్టేడియంలో కోహ్లీ కోచ్ సాయంతో బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు.
దాంతో పాటుగా ఇలా కుటుంబంతో గడుపుతున్నాడు. ఆ సందర్భంగా తీసుకున్న ఫొటోను కోహ్లీ తన ఇన్స్టాగ్రాంలో ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో అతని తల్లి, సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు. ఐతే, ఇందులో కోహ్లీ భార్య అనుష్క శర్మ లేదు. దీంతో అభిమానులు 'కోహ్లీ..అనుష్క ఏది? ఎక్కడికి వెళ్లింది?' అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
అంతేకాదు 'ఫొటో బాగుంది కానీ అనుష్క ఉంటే ఇంకా బాగుండేది; ఫొటోలో ఒకరు మిస్సయ్యారు; కోహ్లీ సోదరి కుమారుడు చూడ్డానికి కోహ్లీలానే ఉన్నాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. జూన్ 15న కోహ్లీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఈ టెస్టు పాస్ అయితేనే ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు అందుబాటులోకి రానున్నాడు.