విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్.. భారత క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా చరిత్రకెక్కారు. లెక్కలేని రికార్డులు సాధించారు. 2011 వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యులుగా ఉన్నారు. దూకుడుగా ప్రత్యర్థిపై మీదకు దూసుకెళ్లే ఈ ఇద్దరూ ఢిల్లీకి చెందినవాళ్లే. 2006లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కోహ్లి అరంగేట్రం చేసినప్పుడు గంభీర్ ఢిల్లీ యూనిట్లోనే ఉన్నాడు.
కోహ్లి-గంభీర్ ఆదిలో మంచి మిత్రులుగా ఉన్నారు. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తనకి వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గంభీర్.. కోహ్లికి అందించాడు. 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంలో కోహ్లి పాత్ర కీలకమని, తొలి సెంచరీ చేసిన యువ విరాట్కు గంభీర్ తన అవార్డు ఇచ్చాడు. మరోవైపు గంభీర్ కోహ్లి కెప్టెన్సీలోనే తన టెస్టు కెరీర్ ముగింపు పలికాడు.

కాగా, ఇంతటి రచ్చ అనంతరం విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ తిరిగి కలిసి పనిచేయనున్నారు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ టీమిండియా కోచ్గా ఎంపికైన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనతో గంభీర్ కోచ్ బాధ్యతలు మొదలుపెట్టనున్నాడు. అయితే లంకతో వన్డే సిరీస్లో కోహ్లి కూడా ఆడనున్నాడు. వీరిద్దరు తిరిగి భారత్ తరఫున ఒకటిగా పోరాడనున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు ఏమైనా జరుగుతాయేమో అని అభిమానులతో సహా బీసీసీఐ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.
అయితే అలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, గతంలో గంభీర్తో జరిగిన గొడవలను మరిచిపోయానని బీసీసీఐకి విరాట్ కోహ్లి వివరణ ఇచ్చాడు. భారత జట్టు ప్రయోజనం కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామని, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ట్రై చేస్తామని కోహ్లి చెప్పాడు. గంభీర్తో ఎలాంటి విభేదాలు ఉండవని బీసీసీఐ పెద్దలకు కోహ్లి హామీ ఇచ్చాడు.