హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరిస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డుని సృష్టించాడు. మూడు టీ20 సిరిస్లో భాగంగా ఆదివారం నాడు నాగ్పూర్లోని విదర్భం క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో కోహ్లీ 21 పరుగులు చేసి అవుటయ్యాడు.
దాంతో టీ20ల్లో ఇంగ్లాండ్పై చెత్త రికార్డుని నెలకొల్పిన కెప్టెన్గా నిలిచాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్పై ఎనిమిది టీ20లు ఆడిన కోహ్లీ 29.25 యావరేజిని నమోదు చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఏ జట్టుపై కూడా కోహ్లీ ఇంతటి ఘోర ప్రదర్శన చేయకపోవడం విశేషం.
ఇంగ్లాండ్ జట్టుపై కోహ్లీ ఆడిన ఎనిమిది ట్వంటీ 20ల్లో 20కిపైగా పరుగుల్ని ఆరుసార్లు మాత్రమే సాధించాడు. దీంతో కోహ్లీ అత్యంత చెత్త యావరేజిని ఇంగ్లాండ్పై నమోదు చేసినట్లయ్యింది. ఇదిలా ఉంటే నాగ్ పూర్లో జరిగిన రెండో టీ20లో ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు.

సిరిస్ను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. చివరి బంతి వరకూ అంతులేని ఉత్కంఠ రేపిన రెండో టీ20లో ఇంగ్లాండ్పై టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా చివరి ఓవర్లో మ్యాజిక్ చేసి, భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 144 పరుగులు చేసింది. ఆ తర్వాత 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకి చివరి ఓవర్లో విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్ను కట్టడి చేసే బాధ్యతను జస్ప్రీత్ బుమ్రాకు భారత కెప్టెన్ కోహ్లీ అప్పచెప్పాడు.
చివరి ఓవర్లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగులు చేయాల్సి ఉండగా బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిలోనే జో రూట్ను అవుట్ చేశాడు. రెండో బంతికి మోయిన్ అలీ సింగిల్ తీయగా, మూడో బంతిలో ఒక్క పరుగు కూడా రాలేదు. నాలుగో బంతిలో జొస్ బట్లర్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతిలో ఒక పరుగు లెగ్బై రూపంలో ఇంగ్లాండ్కు లభించింది.
దీనితో చివరి బంతిలో ఇంగ్లాండ్ గెలవడానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. కానీ, ఆ బంతికి మోయిన్ అలీ బీట్ కావడంతో ఒక్క పరుగు కూడా లభించలేదు. భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్ను అద్భుతంగా బౌల్ చేసిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.